Japan Open 2023 | టోక్యో: భారత యువ షట్లర్ లక్ష్యసేన్ జపాన్ ఓపెన్ సెమీఫైనల్కు దూసుకెళ్లాడు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-750లో లక్ష్యసేన్ జోరు కనబర్చగా.. హెచ్ఎస్ ప్రణయ్తో పాటు ఈ ఏడాది వరుస విజయాలతో ఊపుమీదున్న డబుల్స్ ప్లేయర్లు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి క్వార్టర్స్లో వెనుదిరిగారు. శుక్రవారం క్వార్టర్ ఫైనల్లో లక్ష్యసేన్ 21-15, 21-19తో కోకి వటనబె (జపాన్)పై గెలుపొందాడు. మరో మ్యాచ్లో ప్రపంచ పదో ర్యాంకర్ ప్రణయ్ 21-19, 18-21, 8-21తో ప్రపంచ నంబర్వన్ విక్టర్ అక్సెల్సెన్ (డెన్మార్క్) చేతిలో పోరాడి ఓడాడు.
పురుషుల డబుల్స్లో సాత్విక్-చిరాగ్ జంట 15-21, 25-23, 16-21తో ఒలింపిక్ చాంపియన్స్ లీ యాంగ్-వాంగ్ చీ లాన్ (చైనీస్ తైపీ) ద్వయం చేతిలో ఓడింది. ఫలితంగా 12 మ్యాచ్ల నుంచి పరాజయం లేకుండా సాగుతున్న భారత జోడీ గెలుపు జోరుకు బ్రేక్ పడింది. శనివారం జరుగనున్న సెమీస్లో ఐదోసీడ్ జొనాథన్ క్రిస్టీతో లక్ష్యసేన్ తలపడనున్నాడు.