తెలంగాణ గురుకుల విద్యార్థులు అద్భుతాలు సృష్టిస్తున్నారు. సీఎం కేసీఆర్ మదిలో నుంచి పుట్టిన గురుకులాలు మేలిమి ముత్యాలను అందిస్తున్నాయి. చదువుల్లోనే కాదు ఆటల్లోనూ తాము ఎవరికీ
తీసిపోమని చాటిచెబుతున్నారు. సుశిక్షితులైన కోచ్ల సమక్షంలో రాటుదేలుతున్న ప్లేయర్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు కొల్లగొడుతున్నారు. తాము ఎంచుకున్న క్రీడలో సత్తాచాటుతూ భవిష్యత్ లక్ష్యాలను ఆవిష్కరిస్తున్నారు. ఇప్పటికే పలువురు రాష్ట్ర ఖ్యాతిని దశదిశలా ఇనుమడింపజేయగా, ఇప్పుడు ఇదే కోవలోకి చెరిపెల్లి కీర్తన చేరింది.
సరిగ్గా నాలుగేండ్ల క్రితం అథ్లెటిక్స్ను కెరీర్గా ఎంచుకున్న ఈ జనగామ జిల్లా ముద్దుబిడ్డ ట్రాక్పై రివ్వున దూసుకెళుతున్నది. ప్రతిభకు పేదరికం అడ్డంకి కాదని నిరూపిస్తూ ఆకాశమే హద్దుగా పరుగుల పోటీల్లో అదరగొడుతున్నది. జాతీయ జూనియర్ ఫెడరేషన్ అథ్లెటిక్స్లో కాంస్యం సాధించిన కీర్తన.. ఖేలో ఇండియా స్కీమ్కు ఎంపికై అందరినీ ఆశ్చర్యపరిచింది. స్టార్ అథ్లెట్ హిమాదాస్ను స్ఫూర్తిగా తీసుకున్న ఈ దిండి ఎక్స్ప్రెస్ భవిష్యత్ లక్ష్యాలను ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నది.
ఇటీవల తమిళనాడులో జరిగిన 21వ జాతీయ జూనియర్ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్లో రాణించడం చాలా సంతోషంగా ఉంది. వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన అథ్లెట్ల నుంచి దీటైన పోటీ ఎదురైంది. నేను బరిలోకి దిగిన 3000 మీటర్ల స్టిపుల్చేజ్లో మెరుగైన ప్రదర్శనతో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాను. అథ్లెటిక్స్లో మిగతా విభాగాలతో పోల్చుకుంటే స్టిపుల్చేజ్ ఒకింత భిన్నంగా ఉంటుంది. దీనికి తోడు ఎక్కువ దూరం పరిగెత్తడం ద్వారా మనలో ఉన్న సత్తా ఏంటో తెలుస్తుంది. ప్రస్తుతం నేను శిక్షణ తీసుకుంటున్న దిండి అథ్లెటిక్స్ అకాడమీలో రాటుదేలడం ద్వారా ఈ స్థాయికి చేరుకోగలిగాను. భవిష్యత్లోనూ ఇదే ఆత్మవిశ్వాసంతో పతకాలు సాధిస్తానన్న గట్టి నమ్మకం నాకుంది.
తొలుత ఖో ఖో ద్వారా క్రీడల్లోకి వచ్చాను. నేను చదువుకున్న పాఠశాలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు సుశీల, హేమలత నన్ను బాగా ప్రోత్సహించారు. అయితే టీమ్ గేమ్ అయిన ఖోఖో ద్వారా అంతగా నా ప్రతిభ బయటకు రాలేదు. ఆ సమయంలో టీచర్ల సలహాతో అథ్లెటిక్స్ వైపు మళ్లాను. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ టోర్నీలో 800మీటర్ల రేసులో అత్యుత్తమ టైమింగ్ నమోదు చేశాను. దీంతో జిల్లా స్పోర్ట్స్ మీట్కు తీసుకెళ్లారు. అక్కడ 100మీటర్ల రేసులో రాణించాను. ఇలా పోటీకి దిగిన ప్రతీ టోర్నీలో ఆకట్టుకోవడం ద్వారా 2019లో దిండి అథ్లెటిక్స్ అకాడమీలో చోటు దక్కింది. ఇక అక్కణ్నుంచి మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. గత నాలుగన్నర ఏండ్లలో ఆటకు మెరుగులు అద్దుకుంటూ ముందుకు సాగుతున్నాను. అయితే ఊహ తెలిసినప్పటి నుంచి హిమాదాస్(డింగ్ ఎక్స్ప్రెస్)ను బాగా అభిమానించేదాన్ని. ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్లో పసిడి పతకం గెలువడం ద్వారా వెలుగులోకి వచ్చిన హిమాదాస్ను స్ఫూర్తిగా తీసుకుని పతకాలు సాధిస్తున్నాను.
నాలుగున్నర ఏండ్ల కాలంలో జాతీయ స్థాయి టోర్నీలతో పాటు రెండు ఎస్జీఎఫ్ టోర్నీలు ఆడాను. ఇందులో ఇప్పటి వరకు రెండు స్వర్ణాలు సహా రెండు రజతాలు, మూడు కాంస్య పతకాలు ఖాతాలో వేసుకున్నాను. అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ రాణిస్తున్నాను. భవిష్యత్లో భారత్ తరఫున అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో పతకాలు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. అందుకోసం తీవ్రంగా చెమటోడుస్తున్నాను. స్టిపుల్చేజ్లో కొత్త రికార్డులను నెలకొల్పడమే నా ధ్యేయం.
ఖేలో ఇండియా అథ్లెటిక్స్ స్కీమ్కు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. దేశవ్యాప్తంగా 62 మంది అథ్లెట్లను ఎంపిక చేస్తే అందులో తెలంగాణ నుంచి నేను ఒక్కదానినే ఉన్నాను. ఈ స్కీమ్ కింద రానున్న ఎనిమిదేండ్ల కాలానికి సాయ్ కేంద్రంలో శిక్షణతో పాటు ప్రతీ నెల ప్యాకెట్ మనీ కింద పదివేలు అందించనున్నారు. ఇది నాకు బాగా ఉపయోగపడనుంది.
అథ్లెటిక్స్లో నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణమైన ఎస్సీ గురుకుల విద్యాసంస్థల సహకారం మరువలేనిది. కార్యదర్శి రొనాల్డ్ రాస్ ప్రోత్సాహం చాలా బాగుంది. జాతీయ టోర్నీల్లో రాణించడం ద్వారా సొసైటీ నుంచి లక్ష రూపాయల ఆర్థిక సాయం పొందాను. మా ఊరుకు చెందిన కొందరు ఎన్ఆర్ఐలు స్పోర్ట్స్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు అందజేశారు.
జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామం మా సొంత ఊరు. మా నాన్న కుమారస్వామి ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తుండగా, అమ్మ నాగమణి మేము కౌలుకు తీసుకున్న పొలంలో కూలీగా కాలం వెల్లదీసున్నది. అక్క ఖమ్మంలో బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తుండగా, తమ్ముడు ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాడు. సీఎం కేసీఆర్ నెలకొల్పిన గురుకులాల ద్వారా నాలాంటి ఎంతో మంది పేద విద్యార్థులకు లబ్ధి చేకూరుతున్నది. జాతీయ స్థాయి అథ్లెట్గా ఎదగడంలో ప్రభుత్వ ప్రోత్సాహం మరువలేనిది.
-కీర్తన