సీనియర్ క్రికెటర్లకు బీసీసీఐ కల్పిస్తున్న ‘రెస్ట్ పాలసీ’ తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నది. పట్టుమని పది మ్యాచులు కూడా ఆడని ఆటగాళ్లకు రెస్ట్ ఎందుకని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్లకు తరుచుగా విశ్రాంతినివ్వడంపై మాజీ క్రికెటర్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. తాజాగా ఇదే విషయమై టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సైతం బీసీసీఐ, ఆటగాళ్ల తీరుపై మండిపడ్డాడు.
వెస్టిండీస్ తో వన్డే సిరీస్ కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా వంటి ఆటగాళ్లకు విశ్రాంతినివ్వడంపై గవాస్కర్ స్పందిస్తూ.. ‘నేను దీనికి (రెస్ట్ ఇవ్వడం) అంగీకరించను. మీరు (ఆటగాళ్లు) దేశం తరఫున ఆడుతున్నారు. ఐపీఎల్ ఆడుతున్న సమయంలో రెస్ట్ అడగని మీరు దేశానికి ఆడుతున్నప్పుడు విశ్రాంతిని కోరుకోవడమేంటి..? రెస్ట్ గురించి నా దగ్గర మాట్లాడకండి..
టీ20లలో మీరు ఆడేదే ఇన్నింగ్స్ కు 20 ఓవర్లు. ఆ మాత్రానికి అలసిపోతున్నారా..? టెస్టులలో అయితే 90 ఓవర్లు ఆడాల్సి ఉంటుంది కాబట్టి అలసిపోయామని చెప్పినా అర్థం చేసుకోవచ్చు. కానీ టీ20లు ఆడుతూ అలసిపోవడమేంటి..?’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఇదే వ్యవహారంలో బీసీసీఐ తీరుపై మాట్లాడుతూ.. ‘ఈ విషయంలో బీసీసీఐ ఒక సక్రమమైన పద్ధతిని పాటించాలి. ప్రస్తుతం జట్టులో ఉన్న గ్రేడ్ – ఏ క్రికెట్లర్లందరికీ బోర్డు నుంచి మంచి కాంట్రాక్టులు ఉన్నాయి. అదీగాక ప్రతి మ్యాచ్ కు వాళ్లు పేమెంట్లు అందుకుంటున్నారు. ఏదైనా కంపెనీలో సీఈవో గానీ ఎండీగానీ భారీగా వేతనాలు అందుకుని పదే పదే రెస్ట్ తీసుకుంటాడా నాకు చెప్పండి. భారత క్రికెట్ మరింత ప్రొఫెషనల్ గా మారాలంటే ఈ విషయంలో బీసీసీఐ తప్పకుండా ఒక సరైన విధానాన్ని అనుసరించాలి. విశ్రాంతి కోరుకున్నప్పుడు ఆటగాళ్లు కాంట్రాక్టులలో కూడా కోత విధించుకోవాలి. అప్పుడు మీరు కావాల్సినంత విరామం తీసుకోండి..’ అని సూచించాడు.