పాపన్నపేట, అక్టోబర్ 19 : పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ భవాని మాత సన్నిధి ఆదివారం జన జాతరగా మారింది. సెలవురోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఏడుపాయలకు చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. అయితే.. మళ్లీ సింగూర్ ప్రాజెక్ట్ నుండి నీటిని వదులుతుండడంతో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఉంచి పూజలు నిర్వహించారు. వేకువజామున గర్భగుడిలో అమ్మవారి విగ్రహానికి పూజలు చేసి ఆలయాన్ని మూసివేశారు. అనంతరం రాజా గోపురంలో పూజలు కొనసాగాయి.
ఈ సందర్భంగా పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు ఆలయ ఇవో చంద్రశేఖర్, సిబ్బంది సూర్య శ్రీనివాస్, ప్రతాపరెడ్డి, శ్యామ్, మధుసూదన్ రెడ్డి, నర్సింలు, బత్తిని రాజు, వరుణ్ చారి, యాదగిరి. అనంతరం వేద పండితులు శంకరశర్మ, పార్థివ శర్మ, రాము శర్మ తదితరులు పూజలు నిర్వహించారు. జనం భారీగా పోటెత్తడంతో ఏడుపాయలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తమ సిబ్బందితో కలిసి బందోబస్తు చర్యలు చేపట్టారు.