Yashasvi Jaiswal | స్వదేశంలో ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ వరుసగా రెండు డబుల్ సెంచరీలు చేస్తే ఆ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకున్న ఇంగ్లండ్ బ్యాటర్ బెన్ డకెట్కు ఆ జట్టు మాజీ సారథి నాసిర్ హుస్సేన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. జైస్వాల్ బజ్బాల్ నుంచి నేర్చుకోలేదని, అతడి పెంపకం నుంచే అది వచ్చిందని కొనియాడాడు. చిన్ననాటి నుంచి జైస్వాల్ పడ్డ కష్టం, అతడు ఎదుర్కున్న సవాళ్లు..అతడిని ఈ స్థాయికి చేర్చాయని ప్రశంసలు కురిపించాడు. జైస్వాల్ బజ్బాల్ నుంచి నేర్చుకున్నదేమీ లేదని, కానీ ఇంగ్లండ్ ఆటగాళ్లు అతడి నుంచి నేర్చుకోవాలని హుస్సేన్ సూచించాడు.
రాజ్కోట్ టెస్టులో భాగంగా మూడో రోజు ఆటలో జైస్వాల్ ధనాధన్ ఇన్నింగ్స్తో సెంచరీ చేసిన తర్వాత డకెట్ మాట్లాడుతూ… ‘ప్రపంచంలోని జట్లు మా జట్టు ఆటతీరు (బజ్బాల్)ను చూసి స్ఫూర్తిని పొందుతున్నాయి. జైస్వాల్ చాలా బాగా ఆడాడు. అతడి సెంచరీ క్రెడిట్ మాకే దక్కాలి..’ అని అన్నాడు. తాజాగా ఈ వ్యాఖ్యలపై నాసిర్ హుస్సేన్ స్కై స్పోర్ట్స్లో జరిగిన ఓ టీవీ చర్చలో మాట్లాడుతూ… ‘నేనిప్పుడు జైస్వాల్ మా నుంచి నేర్చుకున్నాడని డకెట్ చెప్పిన మాటలపై స్పందించబోతున్నా. అతడు మీ నుంచి (డకెట్ను ఉద్దేశిస్తూ) ఏమీ నేర్చుకోలేదు. జైస్వాల్ పెంపకంలోనే కష్టాలు, సవాళ్లు ఉన్నాయి. జీవితంలో అతడు ఎన్నో సవాళ్లను ఎదుర్కుని ఐపీఎల్కు వచ్చాడు. అక్కడా రాణించి జాతీయ జట్టులోకి వచ్చాడు. అతడు మీ నుంచి నేర్చుకోవడం కాదు. మీరే జైస్వాల్ నుంచి నేర్చుకోవాలి. ఇంగ్లండ్ టీమే కాదు, నేను కూడా అతడి నుంచి నేర్చుకోవాల్సి ఉంది..’ అని చెప్పాడు.
Nasser Hussain’s epic reply to Ben Duckett’s statement:
– “Yashasvi Jaiswal hasn’t learned from you. He is learnt from his upbringing. And if anything you should look at him and learn from him”. pic.twitter.com/pHbre2I4Qk
— CricketMAN2 (@ImTanujSingh) February 19, 2024
రాజ్కోట్ టెస్టులో ఓడిన తర్వాత అయినా ఇంగ్లండ్ ఆటగాళ్లు తమలో తాము ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిదని హుస్సేన్ హితువు పలికాడు. బయిట ఏం మాట్లాడినా డ్రెస్సింగ్ రూమ్స్కు వెళ్లిన తర్వాత తమ ఆటలో ఉన్న లోపాలను గుర్తించి వాటిని పునరావృతం చేయకుండా ఉంటే మంచిదని సూచించాడు. బజ్బాల్ ఆట ఆడుతున్నా ఈ ఆటతీరులో కూడా నేర్చుకోవాల్సిన విషయాలు బోలెడన్ని ఉన్నాయని హుస్సేన్ అన్నాడు. గతేడాది ఇంగ్లండ్.. స్వదేశంలో జరిగిన యాషెస్ సిరీస్లో కూడా ఇలాగే వెనుకబడి ఉన్నప్పుడు వాళ్ల స్ట్రాటజీని మార్చుకుని అద్భుతంగా పుంజుకుందని, ఇప్పుడు కూడా అలాగే చేయాలని హుస్సేన్ తెలిపాడు.