ODI World Cup 2023 | భారీ ఆశలు పెట్టుకున్న భారత యువ ఓపెనర్ శుభ్మన్ గిల్.. కీలక వరల్డ్కప్ ప్రారంభానికి ముందు అస్వస్థతకు గురవడంతో.. భారత జట్టు బ్యాకప్పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఫుల్ఫామ్లో ఉన్న గిల్పై మేనేజ్మెంట్తో పాటు.. అభిమానులు భారీ అంచనాలు పెట్టుకోగా.. ప్రపంచకప్లో తొలి పోరు ప్రారంభానికి ముందే అతడు డెంగ్యూ బారిన పడ్డాడు. ఫలితంగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్కు గిల్ దూరమయ్యాడు. అతడి స్థానంలో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేయగా.. ఇప్పుడు గిల్ మరింత అస్వస్థతకు గురైనట్లు తెలుస్తున్నది. ప్లేట్లెట్స్ తక్కువ కావడంతో శుభ్మన్ చెన్నైలోని ఓ దవాఖానాలో చేరాడు. అయితే అతడి పరిస్థితి మెరుగ్గానే ఉన్నా.. పూర్తి స్థాయి మ్యాచ్ ఫిట్నెస్ సాధించేందుకు ఇంకా సమయం పట్టే అవకాశమున్నట్లు సమాచారం.
ఈ నెల 14న అహ్మదాబాద్ వేదికగా పాకిస్థాన్తో జరుగనున్న మ్యాచ్ వరకు గిల్ అందుబాటులోకి రావడం సందేహంగానే ఉంది. దీంతో.. భారత యాజమాన్యం ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టినట్లు తెలస్తున్నది. అతడికి రీప్లేస్మెంట్ కాకపోయినా.. కేవలం బ్యాకప్గా మరో ఇద్దరు ఓపెనర్లను సిద్ధంగా ఉంచనున్నట్లు సమాచారం. ఇటీవల ఆసియా క్రీడల్లో భారత జట్టు స్వర్ణ పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించిన యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ను బ్యాకప్గా సిద్ధం చేయనుంది. ఐపీఎల్, దేశవాళీలతో పాటు.. ఈ ఇద్దరూ అవకాశం వచ్చినప్పుడల్లా భారత జట్టు తరఫున కూడా మెరుగైన ప్రదర్శనలు చేసిన విషయం తెలిసిందే.