అంటిగ్వా: దేశానికి ఐదో ప్రపంచకప్ అందించిన యువ భారత జట్టు కెప్టెన్ యష్ ధుల్.. ఐసీసీ ‘మోస్ట్ వ్యాల్యుబుల్ టీమ్’కు సారథిగా ఎంపికయ్యాడు. శనివారం అర్ధరాత్రి ముగిసిన అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో యంగ్ఇండియా 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసి కప్పు కైవసం చేసుకోగా.. టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో ఐసీసీ జట్టును ఎంపిక చేసింది. 12 మందితో కూడిన ఈ జట్టులో యష్ ధుల్తో పాటు ఆల్రౌండర్ రాజ్ బవా, స్పిన్నర్ విక్కీ ఓస్తాల్కు చోటు దక్కింది. ఈ జట్టులో భారత్ నుంచి ముగ్గురు, ఇంగ్లండ్, పాకిస్థాన్ నుంచి ఇద్దరేసి ఆటగాళ్లు ఎంపిక కాగా.. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ నుంచి ఒక్కొక్కరు చోటు దక్కించుకున్నారు.
ఐసీసీ జట్టు: యష్ ధుల్ (కెప్టెన్), రాజ్ బవా, విక్కీ ఓస్తాల్ (భారత్), టామ్ ప్రెస్ట్, జొష్ బొయ్డెన్ (ఇంగ్లండ్), హసీబుల్లా, అవైసీ అలీ (పాకిస్థాన్), టియాగో వైల్లీ (ఆస్ట్రేలియా), బ్రేవిస్ (దక్షిణాఫ్రికా), దునిత్ (శ్రీలంక), రిపన్ మండల్ (బంగ్లాదేశ్), నూర్ అహ్మద్ (అఫ్గానిస్థాన్).