హైదరాబాద్ : గుజరాత్లోని అహ్మదాబాద్లో 36వ జాతీయ క్రీడల ప్రారంభం సందర్భంగా క్రీడాకారులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యవహరించిన తీరును తెలంగాణ రెన్యూయెబుల్ ఎనర్జీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వై సతీష్ రెడ్డి ఖండించారు. వేదికపై క్రీడా జ్యోతి వెలిగించే సందర్భంలో క్రీడాకారులకు అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పడం బాధాకరమన్నారు. ప్రపంచవేదికలపై భారత దేశ ఔన్నత్యాన్ని చాటి చెబుతున్న క్రీడాకారులను స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవమానించారని సతీష్ రెడ్డి అన్నారు.
క్రీడాకారులను గౌరవించుకోవాల్సిన వేదికపై.. ప్రధానమంత్రి తన ఫొటో ప్రియత్వాన్ని ప్రదర్శించుకుని వారిని అవమాన పరచడం సహించదగినది కాదన్నారు. ఒలింపిక్ క్రీడల్లో స్వర్ణపతకాలు సాధించిన క్రీడాకారులను మోదీ అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు చెప్పించి మరీ క్రీడాకారులను వేదికపై పక్కకు తీసుకెళ్లారన్నారు. జాతీయ క్రీడల వేదికపై జరిగిన ఘటన దేశంలోని క్రీడాకారులందరిని అవమానించడమే అవుతుందని సతీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. క్రీడాకారులకు ప్రధానమంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.