అంచనాలు ఫలించలేదు.. అద్భుతాలు సాధ్యపడేలేదు! మరోసారి టీమ్ఇండియాకు నిరాశ తప్పలేదు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో రోహిత్ సేన రన్నరప్తో సరిపెట్టుకుంది. ఆదుకుంటారనుకున్న విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే మధ్యలోనే చేతులెత్తేయడంతో భారత్కు భంగపాటు ఎదురైంది. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా.. ఐసీసీ అన్నీ ట్రోఫీలు కైవసం చేసుకున్న ఏకైక జట్టుగా అవతరించింది.
లండన్: ఐసీసీ నాకౌట్ మ్యాచ్ల్లో తడబాటును కొనసాగిస్తూ.. భారత జట్టు మరోసారి తుదిమెట్టుపై బోల్తాపడింది. 2021 ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన టీమ్ఇండియా ఈ సారి ఆసీస్ చేతిలో 209 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. భారీ లక్ష్యఛేదనలో రోహిత్ సేన ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. 444 పరుగుల టార్గెట్ చేజింగ్లో ఓవర్నైట్ స్కోరు 164/3తో ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమ్ఇండియా 234 పరుగులకు ఆలౌటైంది. కోహ్లీ (49), రహానే (46) కాస్త ప్రతిఘటించినా.. ఆసీస్ పేసర్లు వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టి.. లంచ్ లోపే భారత్ పనిపట్టారు. 90 ఓవర్లలో 280 పరుగులు చేయాల్సిన దశలో చివరి రోజు ఆట కొనసాగించిన టీమ్ఇండియా ఆరంభంలో ఫర్వాలేదనిపించింది.
అయితే ఏడో ఓవర్ వేసేందుకు వచ్చిన బోలాండ్.. భారత్కు డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. మూడో బంతికి విరాట్ కోహ్లీని ఔట్ చేసిన బోలాండ్.. ఐదో బంతికి జడేజా (0)ను బుట్టలో వేసుకున్నాడు. దీంతో భారత్ ఒత్తిడిలో కూరుకుపోగా.. శ్రీకర్ భరత్ (23) అండతో రహానే కాసేపు ప్రతిఘటించినా ఫలితం లేకపోయింది. రహానే ఔటయ్యాక భారత ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. ఆసీస్ బౌలర్లలో లియాన్ 4, బోలాండ్ 3 వికెట్లు పడగొట్టారు. ట్రావిస్ హెడ్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. 2013 చాంపియన్స్ ట్రోఫీ చేజిక్కించుకున్న తర్వాత భారత జట్టు మరే ఐసీసీ టోర్నీలోనూ విజేతగా నిలువలేకపోయింది. చివరి రోజు 70 పరుగులు మాత్రమే చేసి భారత్ మిగిలిన ఏడు వికెట్లు కోల్పోయి వరుసగా రెండోసారి రన్నరప్తో సరిపెట్టుకుంది.
1 టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో ఐసీసీ నిర్వహిస్తున్న అన్నీ ట్రోఫీలు చేజిక్కించుకున్న ఏకైక జట్టుగా ఆస్ట్రేలియా చరిత్రకెక్కింది.
సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 469; భారత్ తొలి ఇన్నింగ్స్: 296;
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 270/8 డిక్లేర్డ్;
భారత్ రెండో ఇన్నింగ్స్: 234 (కోహ్లీ 49, రహానే 46; లియాన్ 4/41, బోలాండ్ 3/46).