దుబాయ్: క్రికెట్లో తొలి వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ముగిసి నెల రోజులైంది. ఇండియా, ఇంగ్లండ్ సిరీస్తో మరికొన్ని రోజుల్లోనే రెండో సీజన్ ప్రారంభం కాబోతోంది. తొలి సీజన్ రెండేళ్ల పాటు సాగింది. అయితే ఇందులో భాగంగా జరిగిన అన్ని సిరీస్ల కంటే ఎక్కువగా డబ్ల్యూటీసీ ఫైనల్కు వ్యూవర్షిప్ వచ్చినట్లు తాజాగా ఐసీసీ వెల్లడించింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ మ్యాచ్ను 17.7 కోట్ల మంది చూశారు. లైవ్ వ్యూవర్లు అయితే గరిష్ఠంగా 13.06 కోట్లు కావడం విశేషం. ఇందులో 94.6 శాతంతో ఇండియానే ఎక్కువ వ్యూవర్లను అందించింది. దేశంలో స్టార్స్పోర్ట్స్, దూర్దర్శన్ ఈ మ్యాచ్ను ప్రత్యక్ష ప్రసారం చేశాయి.
ఈ ఫైనల్కు వచ్చిన వ్యూవర్షిప్పై ఐసీసీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అనురాగ్ దహియా ఆనందం వ్యక్తం చేశారు. అటు న్యూజిలాండ్లోనూ ఈ మ్యాచ్కు మంచి ఆదరణ లభించడం విశేషం. ఆ దేశ జనాభా, వాళ్లకు మ్యాచ్ ప్రసారమైన సమయం (రాత్రి వేళ) అనుకూలించకపోయినా సుమారు 2 లక్షల మంది రాత్రంతా మెలుకవగా ఉండి ఈ మ్యాచ్ చూశారు. ఇటు ఐసీసీ డిజిటల్ ప్లాట్ఫామ్లలోనూ మంచి వ్యూవర్షిప్ వచ్చింది. ఐసీసీ.టీవీలో 6.65 లక్షల లైవ్ వ్యూస్ రావడం విశేషం. మొత్తంగా ఐసీసీ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో 50 కోట్ల మంది ఈ మ్యాచ్ చూశారు.