WPL 2024, RCB vs DC | ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)- 2లో వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి జోష్ మీదున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. నేడు ఢిల్లీ క్యాపిటల్స్తో ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్నది. ఈ సీజన్లో తొలి మ్యాచ్లో యూపీ వారియర్స్పై గెలిచి ఆ తర్వాత గుజరాత్ జెయింట్స్పై అలవోక విజయం సాధించిన ఆర్సీబీ గెలుపు జోష్లో ఉండగా.. మరోవైపు ముంబైతో ఆడిన తొలి మ్యాచ్లో ఓడినా తర్వాత యూపీ వారియర్స్ను చిత్తుగా ఓడించిన ఢిల్లీ.. అదే జోరు కొనసాగించాలని చూస్తున్నది. బెంగళూరు వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్సీబీ టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. మెగ్ లానింగ్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది.
గత సీజన్లో అంచనాలను అందుకోలేకపోయిన ఆర్సీబీ.. ఈ సీజన్లో మాత్రం సాధికారికంగా ఆడుతోంది. ఆల్రౌండ్ ఆటతో ఆ జట్టు వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఆ జట్టు నెట్ రన్ రేట్ (1.665) మెరుగ్గా ఉంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్.. ఫస్ట్ మ్యాచ్లో తేలిపోయినా యూపీతో మ్యాచ్లో మాత్రం ధాటిగా ఆడింది. యూపీ నిర్దేశించిన 120 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఢిల్లీని ఓడిస్తే ఆర్సీబీ ఈ సీజన్లో హ్యాట్రిక్ కొట్టిన టీమ్గా నిలుస్తుంది. ఈ మ్యాచ్లో ఢిల్లీ గెలిస్తే ఆ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరే అవకాశముంది. ఇరుజట్లలోనూ స్టార్ క్రికెటర్లకు కొదవలేదు. ఈ నేపథ్యంలో నేడు ఈ రెండు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో విజయం ఎవరిని వరించేనో మరి..
తుది జట్లు : ఈ మ్యాచ్లో ఆర్సీబీ తరఫున ఎల్లీస్ పెర్రీ స్థానంలో నదైన్ అరంగేట్రం చేస్తుంది. ఢిల్లీ తరఫున సదర్లండ్ ప్లేస్లో జెస్ జొనాసెన్ ఆడుతోంది.
ఆర్సీబీ : స్మృతి మంధాన (కెప్టెన్), సోఫి డివైన్, సబ్బినేని మేఘన, నదైన్ డి క్లర్క్, రిచా ఘోష్, సోఫి మొలినెక్స్, జార్జియా వర్హెమ్, శ్రేయాంక పాటిల్, సిమ్రన్ బహదూర్, ఆశా శోభన, రేణుకా ఠాకూర్
ఢిల్లీ: మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, అలీస్ క్యాప్సీ, జెమీమా రోడ్రిగ్స్, మరిజన్నె కాప్, జెస్ జొనాసెన్, అరుంధతి రెడ్డి, మిన్ను మణి, తానియా భాటియా, రాధా యాదవ్, శిఖా పాండే