WPL 2024, DC vs RCB | మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) లో నేడు కీలకమైన ఫైనల్ పోరుకు ఢిల్లీలోని అరుణ్జైట్లీ స్టేడియం సిద్ధమైంది. తుదిపోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. గత సీజన్ రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ను ఢీకొననుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లోనూ ఫ్రాంచైజీలు కలిగిన ఈ రెండు జట్లూ ఇప్పటివరకూ అక్కడ ట్రోఫీలు నెగ్గలేదు. పురుషుల లీగ్లో సాధించలేని ట్రోఫీని ఏ మహిళల జట్టు సాధిస్తుందోనని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కీలకమైన ఈ ఫైనల్ పోరులో మెగ్ లానింగ్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. స్మృతి మంధాన కెప్టెన్సీలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదట ఫీల్డింగ్ చేయనుంది.
డబ్ల్యూపీఎల్ – 2వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ లీగ్ దశలో అదరగొట్టింది. 8 మ్యాచ్లు ఆడిన ఢిల్లీ.. ఏకంగా ఆరింటిలో గెలిచి 12 పాయింట్లతో నేరుగా ఫైనల్కు అర్హత సాధించింది. ఇక లీగ్ దశలో పడుతూ లేస్తూ (8 మ్యాచ్లు ఆడితే 4 గెలిచి 4 ఓడింది) ప్లేఆఫ్స్కు అర్హత సాధించిన ఆర్సీబీ.. ఎలిమినేటర్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్కు షాకిచ్చింది. ఆ మ్యాచ్లో బ్యాటింగ్లో తక్కువ స్కోరే చేసినా బౌలింగ్లో మాత్రం సమిష్టిగా రాణించి ఫైనల్కు అర్హత సాధించింది.
ఢిల్లీదే పైచేయి..
ఢిల్లీ – బెంగళూరులు కలిసి ఇప్పటివరకూ ఈ లీగ్లో నాలుగుసార్లు ముఖాముఖి తలపడ్డాయి. కానీ నాలుగు మ్యాచ్లలోనూ ఆర్సీబీ ఓడిపోయింది. ఈ సీజన్లో రెండు మ్యాచ్లలో తలపడగా రెండింటిలోనూ ఢిల్లీదే విజయం. గతం ఆర్సీబీకి ఏమంత అనుకూలంగా లేకపోయినా జట్టుగా సమిష్టి విజయాలు అందుకుంటున్న మంధాన అండ్ కో. ఫైనల్లో ఏం చేస్తారోనని ఆ జట్టు అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
టార్గెట్ ట్రోఫీ..
గత సీజన్లో ముంబై ఇండియన్స్ విజేతగా నిలవగా ఢిల్లీ రన్నరప్తో సరిపెట్టుకున్న ఢిల్లీ సారి మాత్రం ఆ తప్పును పునరావృతం చేయాలనుకోవడం లేదు. మెగ్ లానింగ్, అలీస్ క్యాప్సీ, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, మరిజన్నె కాప్, జెస్ జొనాసేన్ వంటి స్టార్ ప్లేయర్లు కలిగిన ఢిల్లీ సొంతగడ్డపై కప్పును ముద్దాడాలని భావిస్తోంది. ఆర్సీబీలోనూ స్టార్లకు కొదవలేదు. స్మృతి మంధాన, ఎల్లీస్ పెర్రీ, సోఫీ డెవిన్, శ్రేయాంక పాటిల్, రేణుకా ఠాకూర్, సోఫి మొలినెక్స్, రిచా ఘోష్, జార్జి్యా వర్హెమ్లు ఏ క్షణంలో అయినా మ్యాచ్ను మలుపు తిప్పగల సమర్థులే.. మరి నేటి మ్యాచ్లో ఏ జట్టు రెండో సీజన్లో విజేతగా నిలుస్తుందో…!