ఢిల్లీ: నిరుడు స్వదేశంలో మహిళల వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు ఆ విజయంతో ప్రపంచంలో తాము ఎక్కడైనా నెగ్గగలమన్న ధీమానిచ్చిందని టీమ్ఇండియా సారథి హర్మన్ప్రీత్ కౌర్ తెలిపింది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఏ రంగంలోనైనా మనం ఏదైనా స్పెషల్గా చేసినప్పుడు తగిన గుర్తింపు దక్కుతుంది.
ఈ విజయం (ప్రపంచకప్) కంటే ముందు మహిళా క్రికెటర్లు ఆటను ముందుకు తీసుకెళ్లేందుకు ఎన్నో కష్టాలుపడ్డారు. వారి సొంతజేబుల్లోంచి డబ్బులు ఖర్చుచేశారు. అయితే ప్రపంచకప్ వంటి ప్రతిష్టాత్మక టైటిల్స్ గెలవడం చాలా ముఖ్యం. వరల్డ్కప్ గెలిచిన తర్వాత దేశంలోని అభిమానులు, మీడియా నుంచి మాకు అపూర్వ ఆదరణ దక్కుతున్నది. ఈ విజయం ఇచ్చిన జోష్తో రాబోయే జూన్లో ఇంగ్లండ్ ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్లోనూ సత్తాచాటుతామన్న నమ్మకం మాకుంది. వన్డే ప్రపంచకప్ గెలుపుతో ప్రపంచంలో ఎక్కడైనా మేం ట్రోఫీలు నెగ్గగలమన్న ధీమాను ఆ విజయం అందించింది’ అని చెప్పింది.