న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక మహిళల బాక్సింగ్ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్నకు వేళయైంది. ఢిల్లీ వేదికగా బుధవారం నుంచి మెగాటోర్నీ మొదలుకాబోతున్నది. ఈ నెల 26 వరకు జరిగే టోర్నీలో 65 దేశాల నుంచి దాదాపు 300 మందికి పైగా బాక్సర్లు బరిలోకి దిగుతున్నారు. ముచ్చటగా మూడోసారి ప్రపంచ బాక్సింగ్ టోర్నీకి ఆతిథ్యమిస్తున్న భారత్ తరఫున 12 మంది పోటీపడుతున్నారు.
డిఫెండింగ్ చాంపియన్ నిఖత్ జరీన్(50కి) మరోమారు టైటిల్ను నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో కనిపిస్తుండగా, టోక్యో ఒలింపిక్స్ కాంస్య విజేత లవ్లీనా బొర్గోహై (75కి) స్థాయికి తగ్గట్లు రాణించేందుకు తహతహలాడుతున్నది. వీరిద్దరికి తోడు నీతు (48కి), సాక్షి (52కి), ప్రీతి (54కి), మనీశా మౌన్ (57కి), జాస్మిన్ (60కి), సాక్షి చోప్రా (63కి), మంజు బంబోరియా(66కి), సనామచా చాను (70కి), సవీటి బూర(80కి), నుపూర్ (81+కి) పోటీకి సై అంటున్నారు. బుధవారం జరిగే టోర్నీ ప్రారంభ కార్యక్రమానికి క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్, అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య (ఐబీఏ) అధ్యక్షుడు ఉమర్ క్రెమ్లెవ్, భారత బాక్సింగ్ ఫెడరేషన్ (బీఎఫ్ఐ) చీఫ్ అజయ్సింగ్, స్టార్ బాక్సర్ మేరీకోమ్, బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్ హాజరు కానున్నారు.