ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పురుషుల సింగిల్స్ పతకం నెగ్గిన ఐదో భారత షట్లర్గా ప్రణయ్ నిలిచాడు. ప్రకాశ్ పదుకొనె, కిడాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్, సాయిప్రణీత్ ముందున్నారు.
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. సహచరులంతా వెనుదిరిగిన తరుణంలో.. ఒంటరి పోరాటం చేస్తూ సెమీఫైనల్కు చేరిన ప్రణయ్.. ఆ అడ్డంకిని అధిగమించలేకపోయాడు. క్వార్టర్స్లో ప్రపంచ చాంపియన్ అక్సెల్సన్ను మట్టికరిపించిన ప్రణయ్.. సెమీస్లో వితిద్సర్న్ చేతిలో పరాజయం పాలై కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు.
కోపెన్హగన్: ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత్ పోరాటం ముగిసింది. పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ఈ టోర్నీ నుంచి రిక్తహస్తాలతోనే వెనుదిరగగా.. హెచ్ఎస్ ప్రణయ్ కాంస్య పతకం చేజిక్కించుకున్నాడు. ఇటీవలి కాలంలో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న ప్రణయ్.. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో పోరాడి ఓడాడు. శనివారం జరిగిన హోరాహోరీ పోరులో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ ప్రణయ్ 21-18, 13-21, 14-21తో మూడో ర్యాంకర్ కునావత్ వితిద్సర్న్ (థాయ్లాండ్) చేతిలో పరాజయం పాలయ్యాడు. ఒక గంటా 16 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి గేమ్ను గెలుచుకున్న 31 ఏండ్ల ప్రణయ్.. ఆ తర్వాత అదే జోరు కొనసాగించడంలో విఫలమయ్యాడు. ప్రపంచ అత్యుత్తమ ప్లేయర్లు మాత్రమే పోటీ పడే ఈ టోర్నీలో సెమీస్లో ఓడిన ప్రణయ్కు కాంస్య పతకం దక్కింది. దీంతో 2011 నుంచి ఈ మెగాటోర్నీలో భారత్ కనీసం ఒక పతకమైనా గెలిచే సంప్రదాయం ఈ సారి కూడా కొనసాగింది. పురుషుల సింగిల్స్లో పతకం సాధించిన ఐదో భారత ఆటగాడిగా ప్రణయ్ రికార్డుల్లోకెక్కాడు.
గత మ్యాచ్లో ఒలింపిక్ చాంపియన్, ప్రపంచ నంబర్వన్ అక్సెల్సన్ను చిత్తుచేసి సగర్వంగా సెమీస్ చేరిన ప్రణయ్.. కీలక పోరులో జోరు కొనసాగించలేకపోయాడు. తొలి గేమ్లో 5-1తో స్పష్టమైన ఆధిక్యం సాధించిన ప్రణయ్.. కీలక సమయాల్లో పాయింట్లు సాధిస్తూ పైచేయి కనబర్చాడు. ప్రత్యర్థి ఎంత ప్రయత్నించినా.. మనవాడు అవకాశం ఇవ్వకపోవడంతో తొలి గేమ్ ప్రణయ్ వశమైంది. ఇంకేముంది మిగిలిన రెండు గేమ్ల్లో ఒక్కటి నెగ్గినా ఫైనల్ చేరడం ఖాయమే అనుకుంటున్న తరుణంలో థాయ్లాండ్ షట్లర్ అద్భుతంగా పుంజుకున్నాడు. రెండో గేమ్ ఆరంభం నుంచి హోరాహోరీగా సాగగా.. ఒక దశలో స్కోరు 7-7తో సమమైంది. ఇలాంటి సమయంలో ప్రణయ్ పదే పదే తప్పులు చేశాడు. మైదానం బయట నుంచి హెడ్ కోచ్ గోపీచంద్, గురుసాయిదత్ ఎంత వారించినా ఫలితం లేకపోయింది. దీంతో ప్రత్యర్థి వరుసగా 7 పాయి ంట్లు సాధించడంతో ఇక కోలుకోలేకపోయాడు. నిర్ణయాత్మక గేమ్లోనైనా ఆకట్టుకుంటాడేమో అనుకుంటే.. అదీ సాధ్యపడలేదు. మెరుగైన రిటర్న్లు బాదినా.. డ్రాప్ షాట్ల విషయంలో ప్రణయ్ అంచనాలు తప్పాయి. ఫలితంగా బంగారం లాంటి అవకాశం చేయి దాటిపోయింది.