న్యూయార్క్: చైనా టెన్నిస్ స్టార్ ప్లేయర్ పెంగ్ షూయి పరిస్థితిపై మహిళల టెన్నిస్ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. పెంగ్ షూయి పేరుతో డబ్ల్యూటీఏకు ఈ-మెయిల్ వచ్చినట్లు చైనా మీడియా సంస్థ ప్రసారం చేసిన వార్తలపై కూడా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్ డబుల్స్ మాజీ చాంపియన్ అయిన పెంగ్ షూయి.. రెండు వారాల క్రితం ఓ సంచలన ఆరోపణ చేశారు. ఆ దేశ మాజీ ప్రధాని జాంగ్ గావోలి లైంగికంగా వేధించినట్లు పెంగ్ ఆరోపించారు. దీనిపై టెన్నిస్ స్టార్లు నోవాక్ జోకోవిచ్, నవోమి ఒసాకాలు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే పెంగ్ ఆచూకీ కోసం వరల్డ్ టెన్నిస్ సంఘం ప్రయత్నించింది. చైనీస్ టెన్నిస్ ప్లేయర్తో కాంటాక్ట్ కావడానికి ప్రయత్నించినా ఆమె ఆచూకీ చిక్కలేదని డబ్ల్యూటీఏ పేర్కొన్నది. అయితే పెంగ్ పేరుతో రిలీజైన ఈ-మెయిల్ ఇప్పుడు ఆమె భవిష్యత్తుపై మరింత ఆందోళన కలిగిస్తోంది..
లైంగిక దాడి జరిగినట్లు ఆరోపణలు చేసిన నాటి నుంచి పెంగ్ ఆనవాళ్లు లేకుండా పోయింది. కానీ తాజాగా ఆమె పేరుతో వచ్చిన ఈ-మెయిల్లో లైంగిక ఆరోపణలు అవాస్తం అన్నట్లు ఉంది. దీంతో టెన్నిస్ లోకం కలవరం వ్యక్తం చేస్తోంది. ఆ ఈ-మెయిల్తో పెంగ్ భద్రతపై మరింత ఆందోళన కలుగుతున్నట్లు డబ్ల్యూటీఏ చైర్మెన్ స్టీవ్ సైమన్ తెలిపారు. నిజంగా పెంగ్ ఆ లేఖ రాసిందా అన్న ఆలోచనలు తమకు వస్తున్నట్లు డబ్ల్యూటీఏ తన ప్రకటనలో పేర్కొన్నది. చైనాకు చెందిన సీజీటీఎన్లో పెంగ్ మెయిల్ ప్రసారం అయ్యింది. అయితే తానేమీ మిస్ కాలేదని, సురక్షితంగానే ఉన్నానని, కేవలం ఇంటి వద్ద రెస్ట్ తీసుకుంటున్నట్లు ఆ మెయిల్లో ఉంది. దీనిపై మహిళల టెన్నిస్ సంఘం డౌట్ వ్యక్తం చేస్తోంది.