కేప్ టౌన్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) రెండేండ్లకోసారి నిర్వహిస్తున్న మహిళల టీ20 ప్రపంచకప్నకు శుక్రవారం తెరలేవనుంది. కేప్టౌన్ వేదికగా జరుగనున్న తొలి మ్యాచ్లోశ్రీలంకతో ఆతిథ్య దక్షిణాఫ్రికా తలపడనుంది. 2009లో ప్రారంభమైన ఈ మెగాటోర్నీ ఇప్పటి వరకు ఏడుసార్లు జరుగగా.. అందులో రికార్డు స్థాయిలో ఆస్ట్రేలియా ఐదుసార్లు విజేతగా నిలిచింది. ఇప్పటికే ఒక హ్యాట్రిక్ పూర్తి చేసుకున్న ఆసీస్ రెండో హ్యాట్రిక్ ఖాతాలో వేసుకోవాలని చూస్తుంటే.. క్రితంసారి (2020లో) తుదిమెట్టుపై బోల్తా కొట్టిన భారత్ ఈ సారి ఎలాగైన ట్రోఫీ పట్టేయాలని భావిస్తున్నది.
గత రెండేళ్లలో పొట్టి ఫార్మాట్లో ఆస్ట్రేలియా ఒకే ఒక్క మ్యాచ్ మాత్రమే ఓడిందంటే (టీమ్ఇండియాతో సూపర్ ఓవర్లో) ఆ జట్టు ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు బ్యాటింగ్, బౌలింగ్లో సమతూకంగా ఉన్న హర్మన్ప్రీత్ సేన సంచలన ప్రదర్శనతో సత్తాచాటాలని తహతహలాడుతున్నది. ఇటీవల జరిగిన అండర్-19 ప్రపంచకప్లో మన అమ్మాయిలు చాంపియన్స్గా నిలువగా.. వాళ్లనే స్ఫూర్తిగా తీసుకొని మహిళల జట్టూ విజృంభించాలని అభిమానులు ఆశిస్తున్నారు.