Womens T20 WC : మహిళల టీ20 వరల్డ్ కప్లో ఈరోజు ఆసక్తికర పోరు జరగనుంది. కేప్టౌన్లోని న్యూలాండ్స్లో భారత్, పాకిస్థాన్ జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. దాంతో, ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. గత రికార్డులు పరిశీలిస్తే.. పాక్పై టీమిండియాకు మెరుగైన రికార్డు ఉంది. ఇప్పటివరకూ టీ20వరల్డ్ కప్లో ఇరుజట్లు ఆరు సార్లు తలపడ్డాయి. టీమిండియా నాలుగు విజయాలతో పాక్పై ఆధిపత్యం చెలాయించింది.
ఈ మ్యాచ్లో భారత జట్టు ఫేవరెట్గా బరిలోకి దిగనుంది. అయితే.. పాక్ను తేలికగా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే.. పోయిన ఏడాది ఆసియా కప్లో పాకిస్థాన్, టీమిండియాకు షాకిచ్చింది. ఆ జట్టు 13 పరుగుల తేడాతో గెలుపొందింది.
స్టార్ ఓపెనర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధానా ఆస్ట్రేలియాతో ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా గాయపడింది. ఫీల్డింగ్ చేస్తుండగా మంధాన వేలికి గాయం అయింది. దాంతో, ఆమె కీలకమైన ఈ మ్యాచ్లో ఆడనుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. అండర్ -19 ఛాంపియన్ షఫాలీ వర్మ ఈ మ్యాచ్లో బ్యాట్ ఝులిపించాలి అనుకుంటోంది. ఈమధ్యే దక్షిణాఫ్రికాలో జరిగిన ముక్కోణపు సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన దీప్తి శర్మ అదే జోరు కొనసాగించాలి. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్ బ్యాటింగ్లో రాణిస్తే భారత్కు ఇక తిరుగుండదు.
టీ20ల్లో ఇప్పటివరకూ ఇండియా, పాకిస్థాన్ 13 మ్యాచుల్లో ఎదురుపడ్డాయి. ఇండియా అత్యధికంగా 10 సార్లు విజయం సాధించింది. పాక్ మూడు విజయాలకే పరిమితం అయింది. ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచుల్లో భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ టాప్ స్కోరర్. ఆమె దాయాదిపై 315 రన్స్ చేసింది.