తొలిసారి నిర్వహిస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ప్లే ఆఫ్ బెర్త్లు ఖరారయ్యాయి. చెరో ఐదు మ్యాచ్లు నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ పదేసి పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో నిలువగా.. యూపీ వారియర్స్ కూడా ముందంజ వేసింది. మరో మ్యాచ్ మిగిలుండగానే బెంగళూరు కథ ముగియగా.. ఎనిమిది మ్యాచ్ల్లో ఆరు పరాజయాలతో గుజరాత్ పట్టిక అట్టడుగున నిలిచింది.
ముంబై: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన యూపీ వారియర్స్ డబ్ల్యూపీఎల్ ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకుంది. సోమవారం జరిగిన తొలి పోరులో యూపీ వారియర్స్ 3 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్పై గెలుపొందింది. తొలుత గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. గార్డ్నర్ (39 బంతుల్లో 60; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), హేమలత (33 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకాలు సాధించారు. యూపీ బౌలర్లలో పార్షవి, రాజేశ్వరి చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో యూపీ వారియర్స్ 19.5 ఓవర్లలో 7 వికెట్లకు 181 పరుగులు చేసింది. గ్రేస్ హారిస్ (41 బంతుల్లో 72; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), తహిలా మెక్గ్రాత్ (38 బంతుల్లో 57; 11 ఫోర్లు) దంచికొట్టడంతో యూపీ వారియర్స్ విజయం సాధించింది. కిమ్ గార్త్ రెండు వికెట్లు పడగొట్టింది. గ్రేస్ హారిస్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
మహిళల ప్రీమియర్ లీగ్ ఆ రెండూ ఔట్..
డబ్ల్యూపీఎల్లో మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే ప్లే ఆఫ్స్ బెర్త్లు ఖరారైనా.. తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు తేలాల్సి ఉంది. లీగ్ దశలో ఎనిమిది మ్యాచ్లు ఆడేసిన గుజరాత్ జెయింట్స్ రెండు విజయాలే సాధించి 4 పాయింట్లతో పట్టిక అట్టడుగున నిలువగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇప్పటి వరకు ఏడు మ్యాచ్లు ఆడి రెండింట నెగ్గింది. మరో మ్యాచ్ మిగిలున్నా.. బెంగళూరు ముందంజ వేసే అవకాశం లేదు. దీంతో డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ నుంచి గుజరాత్, బెంగళూరు ఎలిమినేట్ కాగా.. ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, యూపీ వారియర్స్ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించాయి. ఈ మూడు జట్లు నేడు మ్యాచ్లు ఆడనుండటంతో అగ్రస్థానంలో నిలిచేదెవరనేదానిపై ఆసక్తి నెలకొంది!
ముంబైకి ఢిల్లీ షాక్..
లీగ్ ఆరంభంలో వరుసగా ఐదు విజయాలతో ప్రత్యర్థులను బెంబేలెత్తించిన ముంబై ఇండియన్స్.. వరుసగా రెండో మ్యాచ్లో పరాజయం మూటగట్టుకుంది. సోమవారం జరిగిన పోరులో ఢిల్లీ 9 వికెట్ల తేడాతో ముంబైని చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. పూజ వస్ర్తాకర్ (26), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (23), వాంగ్ (23) తలా కొన్ని పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో మరినె కాప్, శిఖ పాండే, జెస్ జాన్సన్ తలా రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. ఇప్పటికే లీగ్లో తన ఫీల్డింగ్ విన్యాసాలతో ఆకట్టకున్న భారత యువ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ ఈ మ్యాచ్లో కండ్లు చెదిరే క్యాచ్లతో కట్టిపడేసింది. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ 9 ఓవర్లలో వికెట్ నష్టానికి 110 రన్స్ చేసింది. కెప్టెన్ మెగ్ లానింగ్ (32 నాటౌట్; 4 ఫోర్లు, ఒక సిక్సర్), షఫాలీ వర్మ (33; 6 ఫోర్లు, ఒక సిక్సర్), అలీసా కాప్సీ (38 నాటౌట్; ఒక ఫోర్, 5 సిక్సర్లు) దంచికొట్టారు.