మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) వేలానికి రంగం సిద్ధమైంది.వచ్చే ఏడాది జరుగనున్న రెండో సీజన్ కోసం నేడు వేలం పాట నిర్వహించనున్నారు. మొత్తం 30 బెర్తుల కోసం 165 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. భారత క్రికెటర్లతో పాటు వివిధ దేశాల ప్లేయర్లు తమ కనీస ధరతో వేలంలోకి అడుగుపెట్టారు. శనివారం జరిగే వేలంలో ఎవరిని అదృష్టం వరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఐదు ఫ్రాంచైజీలు తమ తమ ప్రణాళికలకు అనుగుణంగా ప్లేయర్లను ఎంపిక చేసుకునే అవకాశముంది. ఎవరు ఏ జట్టులోకి అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది.
WPL | ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) రెండో సీజన్ కోసం శనివారం వేలంపాట జరుగనుంది. రానున్న సీజన్ కోసం నిర్వహిస్తున్న ఈ వేలంలో ఐదు ఫ్రాంచైజీలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారు. మల్లికా సాగర్ వేలాన్ని నిర్వహించనుంది. గత సీజన్ కంటే మెరుగైన ప్రదర్శన కనబర్చాలన్న ఉద్దేశంతో ఈసారి అన్ని ఫ్రాంచైజీలు తమదైన వ్యుహాలతో బరిలోకి దిగుతున్నాయి. అనుభవానికి తోడు యువ రక్తాన్ని జోడిస్తూ ఫలితాలు సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి.
డబ్ల్యూపీఎల్ వేలంలో 30 బెర్తుల కోసం 165 మంది ప్లేయర్లు పోటీపడుతున్నారు. ఇందులో 104 మంది భారతీయులు ఉండగా, 61మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. 56 మంది క్యాప్డ్ ప్లేయర్లు కాగా, 109 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు జాబితాలో ఉన్నారు. ఏ జట్టులోనైనా 18 మందికి మించకుండా ప్లేయర్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
డబ్ల్యూపీఎల్ వేలంలో అదృష్టం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. గత సీజన్లో తీవ్రంగా నిరాశపరిచి ఆఖరి స్థానంతో లీగ్ను ముగించిన గుజరాత్ జెయింట్స్ అందరికంటే ఎక్కువగా 10 బెర్తుల కోసం పోటీపడనుంది. వెస్టిండీస్ స్టార్ దియోంద్ర డాటిన్, ఆస్ట్రేలియా క్రికెటర్ కిమ్ గార్త్ రూ.50 లక్షల కనీస ధరతో వేలంలోకి ప్రవేశిస్తున్నారు. ఆసీస్ ఆల్రౌండర్లు అన్నాబెల్ సదర్లాండ్, జార్జియా వేర్హామ్, శబ్నమ్ ఇస్మాయిల్, అమీ జోన్స్..రూ.40 లక్షల బ్రాకెట్లో ఉన్నారు. భారత వెటరన్ క్రికెటర్ వేదాకృష్ణమూర్తి, పూనమ్ రౌత్, సుష్మావర్మ, ఏక్తాబిస్త్, గౌహర్ సుల్తానా, మోనా మెశ్రమ్, ఎరిన్ బర్న్స్, సోఫీ, డానీ వ్యాట్, టామీ బ్యుమౌంట్, చమరీ ఆటపట్టు, నాడైన్ డీ క్లెర్క్ ..రూ.30 లక్షల విభాగంలో ఉన్నారు.
గత సీజన్లో తీవ్రంగా నిరాశపరిచిన గుజరాత్ జెయింట్స్ ఈసారి పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతున్నది. 10 బెర్తుల కోసం గుజరాత్ 5.95 కోట్లు ఖర్చుపెట్టనుంది. నిరుటి సీజన్లో బేత్ మూనీ ఆదిలోనే గాయంతో వైదొలుగడంతో స్నేహ్ రానా గుజరాత్ కెప్టెన్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆరు ఓటములతో నాలుగో స్థానంలో నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఈసారి తమ జట్టు కూర్పునకు మార్పులు చేసుకునే అవకాశముంది. డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ చాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ భారీ మార్పులకు పోకుండా యువ క్రికెటర్లపై దృష్టి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.