ఐపీఎల్, ఆసియాకప్, వన్డే ప్రపంచకప్, ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్.. ఇలా వరుసగా భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రదర్శనలను ఆస్వాదించిన అభిమానులకు.. ఈ రోజు నుంచి అమ్మాయిలు క్రికెట్ అలరించనుంది. ఇంగ్లండ్ మహిళల జట్టుతో హర్మన్ప్రీత్ కౌర్ బృందం మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు సిద్ధమైంది. బుధవారం వాంఖడే వేదికగా తొలిపోరు జరుగనుండగా.. ఆసియా చాంపియన్స్గా మైదానంలో అడుగుపెడుతున్న మన అమ్మాయిలు ఇంగ్లిష్ టీమ్పై ఆధిపత్యం కనబర్చాలని చూస్తున్నారు!
ముంబై: ఆసియా క్రీడల్లో స్వర్ణం నెగ్గి చరిత్ర సృష్టించిన భారత మహిళల క్రికెట్ జట్టు.. మరో అంతర్జాతీయ సిరీస్కు సిద్ధమైంది. హర్మన్ప్రీత్ సారథ్యంలోని భారత జట్టు ఇంగ్లండ్తో మూడు టీ20లు, ఒక టెస్టు మ్యాచ్ ఆడేందుకు రెడీ అయింది. పొట్టి సిరీస్లో భాగంగా బుధవారం వాంఖడే వేదికగా తొలి టీ20 జరగనుంది. టీ20 ఫార్మాట్లో జరిగిన ఆసియాకప్లో భారత్ అద్వితీయమైన ప్రదర్శన కనబర్చడంతో పాటు అంతకుముందు బంగ్లాదేశ్పై 2-1తో సిరీస్ కైవసం చేసుకొని మంచి జోరు మీద ఉంది. మరోవైపు టీ20ల్లో ప్రపంచ రెండో ర్యాంక్లో ఉన్న ఇంగ్లండ్.. భారత్ను భారత్లో ఓడించి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తున్నది. ర్యాకింగ్స్లో నాలుగో స్థానంలో ఉన్న టీమ్ఇండియాకు స్వదేశంలో ఇంగ్లిష్ జట్టుపై మంచి రికార్డు లేదు. ఇప్పటి వరకు ఇంగ్లండ్తో 9 మ్యాచ్లు ఆడిన భారత్ రెండింట మాత్రమే గెలిచింది.
ఓవరాల్గానూ మన అమ్మాయిల గణాంకాలు అంత గొప్పగా ఏం లేవు. కెప్టెన్ హర్మన్ప్రీత్తో పాటు స్మృతి మంధన, రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, దీప్తి, రేణుక సమిష్టిగా రాణించాలని టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తున్నది. ఇక ఇటీవలే మహిళల కోచ్గా ఎంపికైన రంజీ దిగ్గజం అమోల్ మజుందార్ జట్టును ఎలా తీర్చిదిద్దుతాడనేది ఆసక్తికరం. ఇతర అంతర్జాతీయ జట్లతో పోల్చుకుంటే.. ఫీల్డింగ్, ఫిట్నెస్ అంశంలో మన అమ్మాయిలు వెనుకబడి ఉండటంపై దృష్టి పెట్టనున్నట్లు మజుందార్ వెల్లడించాడు. ‘నాణ్యమైన క్రికెట్ ఆడటమే మా లక్ష్యం. భయం లేకుండా ముందుకు సాగుతాం. ఫీల్డింగ్, ఫిట్నెస్పై దృష్టి పెట్టాం. షఫాలీ, జెమీమా వంటి వాళ్లు ఎంతో ముఖ్యం. వచ్చే ఏడాది జరుగనున్న ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకొని జట్టును తీర్చిదిద్దుతాం. ఆ క్రమంలో ప్రతీ సిరీస్ ముఖ్యమైనదే’ అని మజుందార్ అన్నాడు. మరోవైపు హీతర్ నైట్, అమీ జోన్స్, స్కీవర్ బ్రంట్, డానీ వ్యాట్, సోఫియా ఎకెల్స్టోన్, సారా వంటి ప్రతిభావంతులతో ఇంగ్లండ్ పటిష్టంగా ఉంది.