ముంబై: ఐపీఎల్ 19వ సీజన్లో లీగ్ దశ ఆఖరి రోజు వరకూ ఉత్కంఠరేపిన నాలుగో ప్లేఆఫ్స్ బెర్తు రాజస్థాన్ రాయల్స్ వశమైంది. జోఫ్రా ఆర్చర్ (15 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 32; 3/17) ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టడంతో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్కు చెక్ పెట్టిన రాయల్స్ 16 పాయింట్లతో నాలుగో స్థానంతో నేరుగా ప్లేఆఫ్స్ చేరుకుంది. ఫలితంగా పంజాబ్ కింగ్స్ (15)తో చివరి లీగ్ పోరుకు ముందే కోల్కతా నైట్ రైడర్స్ (13) ఆశలు ఆవిరయ్యాయి. ఆదివారం సాయంత్రం వాంఖడే స్టేడియంలో జరిగిన రాజస్థాన్ 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాయల్స్ నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యఛేదనలో ముంబై 20 ఓవర్లలో 175/9 స్కోరుకు పరిమితమైంది. సూర్యకుమార్యాదవ్(42 బంతుల్లో 3ఫోర్లు, 4సిక్సర్లతో 60) అర్ధసెంచరీతో ఒంటరిపోరాటం చేసినా లాభం లేకపోయింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా(34), విల్జాక్స్(33) ఫర్వాలేదనిపించారు. ఆర్చర్కు తోడు బర్గర్, బ్రిజేశ్, యశ్రాజ్ రెండేసి వికెట్లతో రాణించారు. అంతకుముందు ధృవ్ జురెల్ 26(26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 38), ఆర్చర్ కీలక ఇన్నింగ్స్లతో ఆకట్టుకోవడంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 205/8 స్కోరు చేసింది. దీపక్ చహర్(2/43), శార్దుల్ ఠాకూర్(2/41) రెండు వికెట్లు తీశారు. ఆర్చర్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది. బుధవారం జరిగే ఎలిమినేటర్ పోరులో సన్రైజర్స్తో రాజస్థాన్ తలపడనుంది.
టాస్ గెలిచిన ముంబై..రాజస్థాన్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. లీగ్లో సూపర్ఫామ్ మీదున్న వైభవ్ సూర్యవంశీ (4)..మరోమారు తాను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్స్గా మలిచే ప్రయత్నం చేశాడు. కానీ విల్జాక్స్ అద్భుత ఫీల్డింగ్తో అది సాధ్యపడలేదు. మరో ఎండ్లో యశస్వి జైస్వాల్ (27)దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. రాయల్స్ ఓపెనర్లను ఆదిలోనే కట్టడి చేసేందుకు విల్ జాక్స్ స్పిన్ తంత్రం సఫలమైంది. షాట్ ఆడే ప్రయత్నంలో జైస్వాల్..పాయింట్లో బాచ్ చేతికి చిక్కాడు. రెండు బంతుల తేడాతోసూర్యవంశీ..చహర్ బౌలింగ్లో నమన్ ధీర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వచ్చి రావడంతోనే జోరు ప్రదర్శించిన కెప్టెన్ రియాన్ పరాగ్(14).. ఘజన్ఫర్ బౌలింగ్లో బౌండరీ లైన్ వద్ద తిలక్ సూపర్ క్యాచ్తో మూడో వికెట్గా పెవిలియన్ చేరడంతో రాయల్స్ పవర్ ప్లే పూర్తయ్యేసరికి 54/3తో ఇబ్బందుల్లో పడింది. ఈ స్థితిలో జురెల్, షనక (29)సింగిల్స్తో రొటేట్ చేస్తూ స్కోరుబోర్డును ముందుకు నడిపించారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడుతూ చెత్త బంతులను బౌండరీలకు తరలించారు. ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న తరుణంలో షనక రనౌట్ కావడంతో నాలుగో వికెట్కు 45 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. 11 ఓవర్లు పూర్తయ్యే సరికి రాయల్స్ 100 పరుగుల మార్క్ అందుకోగా, ఘజన్ఫర్ను లక్ష్యంగా చేసుకుంటూ జురెల్ రెండు ఫోర్లు, ఓ భారీ సిక్స్తో ఇన్నింగ్స్కు ఊపు తెచ్చే ప్రయత్నం చేశాడు. కానీ, 13వ ఓవర్లో అతడిని క్లీన్ బౌల్డ్ చేసిన కార్బిన్ బాష్ రాయల్స్ వేగానికి అడ్డు కట్ట వేశాడు. ఈ సమయంలో బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వచ్చిన ఆర్చర్, జడేజా(19 నాటౌట్) ఆఇఖరి ఓవర్లలో బ్యాట్లు ఝుళిపించడంతో రాజస్థాన్ స్కోరు 200 దాటింది
బ్యాటింగ్లో మెప్పించిన ఆర్చర్.. ఆపై బంతితోనూ రాజస్థాన్ను ముందుండి నడిపించాడు. ఛేదనకు దిగిన ముంబైని కొత్త బంతితో ఉక్కిబిక్కిరి చేశాడు. తొలి ఓవర్లో ఒక్క పరుగే ఇచ్చిన అతను ఓపెనర్ రోహిత్ శర్మ (0)ను పదునైన ఔట్ స్వింగర్తో గోల్డెన్ డకౌట్ చేశాడు. మరో ఓపెనర్ రికెల్టన్ (12) ఓ ఫోర్, సిక్స్తో దూకుడు కనబర్చే ప్రయత్నం చేయగా, మూడో ఓవర్లో నమన్ ధీర్(6)ను ఔట్ చేసి ముంబైని ఆర్చర్ మళ్లీ దెబ్బతీశాడు. రికెల్టన్ కూడా బర్గర్ బౌలింగ్లో సూర్యవంశీకి క్యాచ్ ఇచ్ ఇవ్వగా.. ఆ వెంటనే తిలక్వర్మ (3)ను బ్రిజేశ్ పటేల్ లెగ్ కట్టర్తో బౌల్డ్ చేయడంతో ముంబై 38/4తో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో సూర్యకుమార్ జట్టును ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకున్నాడు. ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీకి చేర్చిన అతను మంచి షాట్లతో అలరించగా.. అతనికి విల్ జాక్స్ జత కలిశాడు. రాయల్స్ బౌలింగ్ను సమర్థంగా ఎదుర్కొంటూ ఈ ఇద్దరూ ఫోర్లు, సిక్స్లతో ఆకట్టుకోవడంతో సగం ఓవర్లకు ముంబై 90/4తో కోలుకుంది. అయితే, బౌలింగ్ చేంజ్లో భాగంగా వచ్చిన యశ్రాజ్…జాక్స్ను ఔట్ చేసి రాయల్స్ను తిరిగి పోటీలోకి తీసుకొచ్చాడు. కెప్టెన్ హార్దిక్ వచ్చీరావడంతో వరుస బౌండరీలతో విరుచుకుపడ్డాడు. యశ్రాజ్ ఓవర్లో రెండు భారీ సిక్స్లు బాదిన అతను షనక ఓవర్లో రెండు ఫోర్లతో జోరు ప్రదర్శించాడు. మరోవైపు 32 బంతుల్లో సూర్య అర్ధసెంచరీ మార్క్ అందుకోగా 15 ఓవర్లకు ముంబై 147/5తో గెలుపు దిశగా పయనించింది. కానీ, తన చివరి ఓవర్ వేసేందుకు వచ్చిన ఆర్చర్..హార్దిక్ను ఔట్ చేసి ముంబై ఆశలపై నీళ్లు చల్లాడు. ఆపై బాష్(2), సూర్యకుమార్, దీపక్ చహర్(8) పెవిలియన్కు క్యూ కట్టడంతో ముంబైకి ఓటమి తప్పలేదు.
రాజస్థాన్: 20 ఓవర్లలో 205/8(జురెల్ 38, ఆర్చర్ 32, శార్దుల్ 2/41, చహర్ 2/43);
ముంబై: 20 ఓవర్లలో 175/9(సూర్యకుమార్ 60, హార్దిక్ 34, ఆర్చర్ 3/17, బ్రిజేశ్ 2/26)