టోక్యో: ఒలింపిక్స్లో రెండో మెడల్ గెలిచి చరిత్ర సృష్టించిన హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు(PV Sindhu) సోమవారం వర్చువల్గా మీడియాతో మాట్లాడింది. కోచ్ పార్క్తో కలిసి ఆమె ప్రెస్మీట్కు వచ్చింది. దేశం తరఫున ఒలింపిక్స్ మెడల్ గెలవడమే గర్వకారణమంటే అందులోనూ వరుసగా రెండో మెడల్ గెలవడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా సింధు చెప్పింది. బ్రాంజ్ మెడల్ మ్యాచ్లో చివరి పాయింట్ సాధించిన తర్వాత కొద్దిసేపు నా మెదడు పని చేయలేదు. ఐదు, ఆరు సెకన్ల వరకూ అంతా బ్లాంక్గా ఉంది. ఆ తర్వాత విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాను.
సెమీఫైనల్ తర్వాత చాలా బాధపడ్డాను. ఏడ్చేశాను. అయితే కోచ్, ఫిజియో బాగా ఎంకరేజ్ చేశారు. ఇంతటితో అయిపోలేదని, మరో అవకాశం ఉన్నదని చెబుతూ ప్రోత్సహించారు. బ్రాంజ్ గెలవడానికి, నాలుగోస్థానంలో రావడానికి చాలా తేడా ఉన్నదని కోచ్ పార్క్ చెప్పాడు. ఆ మాటలు నాకు ఎంతగానో ఉపకరించాయి అని సింధు చెప్పింది. ఒలింపిక్స్కు వెళ్లే ముందు ప్రధాని మోదీతో ఆమె మాట్లాడింది. ఈ సందర్భంగా మెడల్తో తిరిగి వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి ఐస్క్రీమ్ తిందామని మోదీ అన్నారు. మరి ఆయనతో కలిసి ఏ ఫ్లేవర్ ఐస్క్రీమ్ తింటారని ప్రశ్నించగా.. ఏ ఐస్క్రీమ్ తింటానో నాకు తెలియదు కానీ.. కచ్చితంగా తింటాను అని ఆమె చెప్పింది. సెమీస్ తర్వాత అసలు బాధపడాలో, మరో అవకాశం ఉన్నందుకు సంతోషపడాలో అర్థం కాని పరిస్థితుల్లో తాను ఉన్నట్లు సింధు తెలిపింది.
బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు చెప్పింది. తాను ఏది అడిగినా కాదనుకుండా అసోసియేషన్ ఇచ్చినట్లు సింధు తెలిపింది. పారిస్ ఒలింపిక్స్కు ఇంకా సమయం ఉన్నదని, ప్రస్తుతానికైతే తాను ఈ విజయాన్ని ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నట్లు ఆమె చెప్పింది.