పాకిస్తాన్తో టీ20, వన్డే సిరీస్ ఆడేందుకు వెళ్లిన విండీస్ బృందాన్ని కరోనా భూతం పట్టుకుంది. కరాచీలో విమానం దిగీ దిగగానే చేసిన కరోనా టెస్టుల్లో ముగ్గురు ఆటగాళ్లు, సహాయక సిబ్బందిలో ఒకరు కరోనా పాజిటివ్గా తేలారు. దీంతో వాళ్లందరినీ ఐసోలేషన్లో ఉంచారు. పాక్తో సిరీస్ జరుగుతుందా? అని అనుమానాలు వచ్చాయి.
అయితే ఈ అనుమానాలు, భయాలను పక్కనపెట్టి టీ20 సిరీస్ ఆడారు. మూడో టీ20 మ్యాచ్ ముందు కొవిడ్-19 ప్రోటోకాల్స్లో భాగంగా మరోసారి అందరికీ కరోనా టెస్టులు చేశారు. వీటిలో విండీస్ బృందంలో మరో ఐదుగురికి కరోనా పాజిటివ్ ఫలితం వచ్చింది. ఈ నేపథ్యంలో మూడో టీ20 మ్యాచ్ ఆడిన తర్వాత.. వన్డే సిరీస్ను వాయిదా వేయాలని రెండు దేశాల బోర్డులు నిర్ణయించాయి.
ఈ మేరకు సంయుక్తంగా అధికారిక ప్రకటన చేశాయి. వచ్చే ఏడాది జూన్లో ఈ సిరీస్ ఆడతామని ఇరుబోర్డులు తెలిపాయి. కాగా, మూడో టీ20 తర్వాత కరోనా నెగిటివ్ వచ్చిన విండీస్ ఆటగాళ్లందరూ స్వదేశానికి బయలుదేరనున్నారు. కరోనా సోకిన ఆటగాళ్లు మాత్రం కరాచీలోనే తమ క్వారంటైన్ పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణమవుతారు. కరోనా నెగిటివ్ వచ్చిన పాక్ ఆటగాళ్లు కూడా బయోబబుల్ వీడతారని సమాచారం.