ముంబై: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ వణికిస్తున్నా.. ఐపీఎల్ మాత్రం సుమారు నాలుగు వారాల పాటు విజయవంతంగా నడిచింది. లీగ్ కోసం కఠినమైన బయో బబుల్ ఏర్పాటు చేశారు. ఆ బబుల్ నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా, లోనికి ఎవరూ రాకుండా చూశారు. అయినా నలుగురు ప్లేయర్స్ కరోనా వైరస్ బారిన పడటం, తర్వాత టోర్నీని వాయిదా వేయాల్సి రావడం జరిగిపోయాయి. అయితే ఇప్పటికీ బబుల్లోకి వైరస్ ఎలా వచ్చిందన్నదానిపై స్పష్టమైన సమాధానం మాత్రం రాలేదు. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ దీనిపై స్పందించాడు. ఇండియన్ ఎక్స్ప్రెస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బబుల్లోకి వైరస్ ఎలా వచ్చిందో అంతుబట్టడం లేదని చెప్పాడు.
బబుల్ ఉల్లంఘన జరగలేదని మాకు అందిన రిపోర్ట్ ప్రకారం తేలింది. అయితే వైరస్ ఎలా చొరబడిందో చెప్పడం చాలా కష్టం. అదే కాదు దేశంలో ఇంత మందికి వైరస్ ఎలా సోకిందో చెప్పడం కూడా కష్టం అని గంగూలీ అన్నాడు. ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్తోపాటు కోల్కతా నైట్రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్లోని ప్లేయర్స్, సిబ్బందికి కరోనా సోకింది. రోజు రోజుకీ వైరస్ బారిన పడుతున్న వాళ్ల సంఖ్య పెరిగిపోతుండటంతో లీగ్ను వాయిదా వేయాలని నిర్ణయించారు.
బబుల్లోకి వైరస్ రాకుండా ప్రొఫెషనల్స్ కూడా అడ్డుకోలేరు. ఇంగ్లండ్లో సెకండ్ వేవ్ సందర్భంగా కూడా ఇదే జరిగింది. ఇంగ్లిష్ ప్రిమియర్ లీగ్ బబుల్లోకి వైరస్ చొరబడింది. మాంచెస్టర్ సిటీ, ఆర్సెనల్ ప్లేయర్స్ వైరస్ బారిన పడ్డారు అని గంగూలీ వెల్లడించాడు.
ఇక ఐపీఎల్ రీషెడ్యూల్ ఎప్పుడన్నదానిపైనా గంగూలీ స్పష్టత ఇవ్వలేదు.
ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్లో ఐపీఎల్ రీషెడ్యూల్ చేయడం అంత సులువు కాదు. ఇంగ్లిష్ ప్రిమియర్ లీగ్ అయితే ఆరు నెలల షెడ్యూల్ కాబట్టి వాళ్లు రీషెడ్యూల్ చేయగలిగారు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ప్లేయర్స్ను ఆయా దేశాలకు రిలీజ్ చేయాలి. రీషెడ్యూలింగ్ చాలా కష్టం అని గంగూలీ అన్నాడు. యూఏఈలో నిర్వహించాలని మొదట అనుకున్నా.. లీగ్ ప్రారంభమయ్యే సమయానికి ఇండియాలో పెద్దగా కేసులు లేకపోవడంతో అలాగే ముందుకు వెళ్లామని చెప్పాడు.