భారత జట్టులో ఎందరో సూపర్ స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. ముఖ్యంగా ధోనీ హయాంలో భారత క్రికెట్కు అత్యద్భుతమైన ఆటగాళ్లు లభించారనే చెప్పాలి. కోహ్లీ, రోహిత్, జడేజా, అశ్విన్ వంటి వారు అంత సక్సెస్ అవడంలో ధోనీ పాత్ర చాలా ఉంది. అలాగే కొంతకాలంగా భారత జట్టుకు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా కూడా ధోనీ సారధ్యంలోనే అరంగేట్రం చేశాడు.
2016లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్లో పాండ్యా తొలిసారి బ్లూజెర్సీ వేసుకున్నాడు. తొలి ఓవర్లో ఏకంగా 21 పరుగులిచ్చాడు. దాంతో ఇక తనకు బౌలింగ్ ఇవ్వరని ఫిక్స్ అయిపోయానని, కానీ కాసేపటికే ధోనీ పిలిచి మరో ఓవర్ ఇచ్చాడని పాండ్యా గుర్తుచేసుకున్నాడు.
ఆ మ్యాచ్లో అతను రెండు వికెట్లు తీశాడు. ‘‘నేను చూస్తూ పెరిగిన స్టార్ ఆటగాళ్లతో కలిసి ఆడటం ఎంతో సంతోషాన్నిచ్చింది. అయితే తొలి ఓవర్లోనే అంత ధారాళంగా పరుగులు ఇవ్వడంతో అంతా అయిపోయిందనే అనుకున్నా. కానీ ధోనీ నాపై నమ్మకం ఉంచాడు’’ అని చెప్పాడు. మూడు టీ20ల్లో ఒక్కసారి కూడా బ్యాటింగ్ చేసే అవకాశం పాండ్యాకు రాలేదు.
కానీ సిరీస్లో మొత్తం మూడు వికెట్లు తీశాడు. మూడో మ్యాచ్ ముగిసిన తర్వాత ధోనీ వద్దకు వచ్చి.. ‘‘నువ్వు ప్రపంచకప్ ఆడే జట్టులో కూడా ఉంటావ్’’ అని చెప్పాడని పాండ్యా అన్నాడు. ఆ మాటలు విని తను షాకైపోయానని చెప్పాడు. ఒక్కసారి కూడా బ్యాటింగ్ చెయ్యలేదు కదా అంటే.. ‘‘నిన్ను నువ్వు స్పష్టంగా ఎక్స్ప్రెస్ చేశావు. అది చాలు’’ అని ధోనీ అన్నాడట.
ఇదే విషయాన్ని చెప్పిన పాండ్యా.. ‘‘మూడో మ్యాచ్ ఆడిన నేను.. భారత్ తరఫున ప్రపంచకప్ ఆడతానని అనేసరికి నాకు ఏం చేయాలో తోచలేదు. నా కల నెరవేరినట్లు అయింది. చాలా సంతోషంగా అనిపించింది’’ అని పాండ్యా వివరించాడు. గాయం కారణంగా కొంతకాలంగా టీమిండియాకు దూరంగా ఉంటూ వచ్చిన పాండ్యా.. తాజాగా ఐపీఎల్లో గుజరాత్ కెప్టెన్గా అదరగొట్టాడు. బంతితో, బ్యాటుతోనే కాకుండా తొలిసారే సారధిగా తనదైన ముద్రవేస్తూ ఐపీఎల్ ట్రోఫీ సాధించిన సంగతి తెలిసిందే.