టెస్టు కెప్టెన్సీ నుంచి తను తప్పుకున్నప్పుడు కేవలం ఎంఎస్ ధోనీ మాత్రమే తనకు మెసేజ్ చేశాడని, తనతో కలిసి ఆడిన చాలా మంది దగ్గర తన మొబైల్ నెంబర్ ఉన్నప్పటికీ టీవీల్లో సలహాలు ఇచ్చే వాళ్లు ఎవరూ తనను సంప్రదించలేదని తాజాగా కోహ్లీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఘాటుగా స్పందించాడు.
‘అతనికి ఏం మెసేజ్ కావాలి?’అని సన్నీ అడిగాడు. ‘అంటే ప్రోత్సహించాలా? ఎంకరేజ్మెంట్ ఇవ్వాలా? అప్పటికి కెప్టెన్సీ వద్దని అనుకున్నాడు కదా. అలాంటప్పుడు ఇక ఎంకరేజ్మెంట్ దేనికి?’ అని ప్రశ్నించాడు. అతనికి ఎవరు మెసేజ్ చెయ్యలేదో వాళ్ల పేర్లు చెప్తే బాగుంటుంది కదా అని అడిగాడు. పాకిస్తాన్ చేతిలో భారత్ ఓటమి తర్వాత మీడియా సమావేశంలో పాల్గొన్న కోహ్లీ.. ధోనీతో తనకున్న బంధం గురించి చెప్తూ ఈ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.