న్యూఢిల్లీ: లండన్లోని ఓవల్ స్టేడియం వేదికగా జరుగుతున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్లో భారత్ ముందు ఆస్ట్రేలియా జట్టు 444 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఇప్పటి వరకు టెస్టు క్రికెట్లో ఛేదించిన అత్యధిక లక్ష్యం ఎంత అనే అంశం చర్చకు వచ్చింది. దాంతో పాత రికార్డులను పరిశీలిస్తే భారత్ కేవలం ఒక్కసారి మాత్రమే 400 పరుగులకు పైగా లక్ష్యాన్ని ఛేదించగలిగింది.
భారత్ 1976 ఏప్రిల్లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో 147 ఓవర్లు ఆడి కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి 406 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఇదే టెస్టు క్రికెట్లో ఇప్పటివరకు భారత్ ఛేదించిన అత్యధిక లక్ష్యంగా రికార్డుల్లో ఉంది. ఆ తర్వాత 2008 డిసెంబర్లో చెన్నైలో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ 98.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 387 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించగలిగింది. ఇది భారత్కు రెండో అత్యధిక లక్ష్య ఛేదన.
ఇక 2021 జనవరిలో బ్రిస్బేన్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో భారత్ 97 ఓవర్లు ఆడి ఏడు వికెట్లు కోల్పోయి 329 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఇది భారత్ ఛేదించిన మూడో అత్యధిక లక్ష్య ఛేదనగా రికార్డుల్లో ఉంది. అదేవిధంగా ఆస్ట్రేలియా జట్టు మీద భారత్ ఛేదించిన అత్యధిక లక్ష్యసాధనగా కూడా ఇదే ఉంది. ఇప్పుడు అదే ఆస్ట్రేలియా మీద 444 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు భారత్ రంగంలోకి దిగింది.
ఇదిలావుంటే ఓవల్ క్రికెట్ స్టేడియంలో ఇప్పటివరకు 263 పరుగులే అత్యధిక లక్ష్య ఛేదనగా ఉంది. 1902లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ ఆ లక్ష్యాన్ని ఛేదించింది. ఆ తర్వాత వెస్టిండీస్ ఛేదించిన 253 పరుగులు రెండో అత్యధిక లక్ష్య ఛేదనగా ఉన్నది. ఆ గ్రౌండ్లో మూడో అత్యధిక లక్ష్య ఛేదన 242 పరుగులు. అంటే మ్యాచ్లో భారత్ విజయం సాధించాలంటే ఈ గ్రౌండ్లో అత్యధిక లక్ష్య ఛేదన కంటే దాదాపు 200 పరుగులు ఎక్కువగా చేయాల్సి ఉంది.