న్యూఢిల్లీ: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు వ్యవహరిస్తున్న తీరును మాజీ క్రికెటర్ కపిల్ దేవ్(Kapil Dev) ప్రశ్నించాడు. 1983 వరల్డ్కప్ విన్నింగ్ జట్టు కెప్టెన్ అయిన కపిల్.. బీసీసీఐ వైఖరిని తప్పుపడుతున్నారు. వరల్డ్కప్ దగ్గరపడుతున్న సమయంలో.. ఫాస్ట్బౌలర్ బుమ్రా(Bumrah) ఇంకా రెఢీ కాకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆటగాళ్లు, బీసీసీఐ తీరును ఆయన ఖండించారు. వరల్డ్ కప్ లాంటి మెగా ఈవెంట్ల ముందు మేటి ఆటగాళ్లు సిద్ధంగా ఉండాలని, కానీ బుమ్రా లాంటి బౌలర్ ఏడాదిగా జట్టుకు దూరంగా ఉన్నాడని, అతని ఫిట్నెస్ ఎలా ఉందో కూడా తెలియదన్నారు. కానీ ఆటగాళ్లు తమకు స్వల్ప గాయాలైనా.. ఐపీఎల్ లాంటి క్రికెట్ టోర్నీలు ఆడేందుకు మొగ్గుచూపుతున్నారని, జాతీయ జట్టుకు ఆడేందుకు ఇష్టాన్ని ప్రదర్శించడం లేదని కపిల్ విమర్శించారు.
బుమ్రా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారని, కానీ అతను వరల్డ్కప్ ఆడలేకపోతే .. సమయాన్ని వృధా చేసినట్లే అవుతుందన్నాడు. రిషబ్ పంత్ కూడా మంచి క్రికెటర్ అని, అతను ఉంటే టెస్టు జట్టు బలంగా తయారవుతుందన్నాడు. ఐపీఎల్ టోర్నీ మంచిదే అయినా.. ఆ టీ20 లీగ్ కోసం అంతర్జాతీయ మ్యాచ్లను విస్మరించడం సరికాదు అని కపిల్ పేర్కొన్నారు. దేవుడి దయ వల్ల తాను ఆడిన రోజుల్లో గాయాలపాలు కాలేదని, కానీ ఈ రోజుల్లో క్రికెటర్లు ఏడాదిలో 10 నెలల ఆడుతున్నారని, అలాంటప్పుడు గాయాలు కామన్ అని, కానీ ఐపీఎల్ లాంటి టోర్నీలు భవిష్యత్తును నాశనం చేసే ఛాన్సు ఉందన్నాడు. ఐపీఎల్ సమయంలో గాయమైనా మ్యాచ్ ఆడుతున్నారని, కానీ టీమిండియా తరపున మాత్రం ప్లేయర్లు ఆడలేని స్థితిలో ఉన్నట్లు కపిల్ విమర్శించారు.