IND vs SL | ఆసియాకప్ ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు అన్నీ మ్యాచ్లకు వర్షం అడ్డుపడింది. లీగ్ దశలో భాగంగా చిరకాల ప్రత్యర్థి భారత్, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ భారీ వర్షం కారణంగా అర్ధాంతరంగా రద్దు కాగా.. ఆ తర్వాత కూడా పలు మ్యాచ్లకు వరుణుడు అడ్డుకున్నాడు. దీంతో సూపర్-4 దశలో భారత్, పాకిస్థాన్ పోరుకు రిజర్వ్ డే కేటాయించారు. ఆందోళన చెందినట్లే ఆ మ్యాచ్కు కూడా వర్షం ఆటంకం కలిగించగా.. రెండు రోజుల పాటు సాగిన పోరులో టీమ్ఇండియా విజయం సాధించింది. ఆదివారం జరుగనున్న ఫైనల్కు వర్షం అంతారాయం కలిగించవచ్చని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరి ఈ నేపథ్యంలో భారత్, శ్రీలంక మ్యాచ్ రద్దయితే పరిస్థితేంటి?
దాయాదుల పోరులాగే తుది సమరానికి కూడా రిజర్వ్ డే కేటాయించారు. అంటే అనివార్య కారణాల వల్ల ఆదివారం ఆట సాధ్యం కాకపోతే సోమవారం ఫైనల్ కొనసాగుతుంది. రెండు రోజుల్లో కలిపి కనీసం 20 ఓవర్ల మ్యాచ్ సాధ్యమైనా.. అందులో మెరుగైన ప్రదర్శన చేసిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. అలా కాకుండా వరుణుడు గనక తెరిపినివ్వకపోతే.. మాత్రం ఇరు జట్లను ఉమ్మడి విజేతగా ప్రకటిస్తారు. అయితే ప్రధాన ఆటగాళ్లు గాయాలతో దూరమవడం శ్రీలంకను ఇబ్బంది పెడుతుండగా.. భారత్ మాత్రం మెరుగైన బలగంతో మెగా మ్యాచ్కు సిద్ధమైంది. 1984లో ప్రారంభమైన ఆసియాకప్లో ఇప్పటి వరకు టీమ్ఇండియా అత్యధికంగా 7 సార్లు విజేతగా నిలువగా.. ఆ తర్వాత శ్రీలంక ఆరు సార్లు టైటిల్ ఎగరేసుకుపోయింది.