India Squad For SA T20I | ఐపీఎల్లో తన వేగంతో అదరగొట్టి టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ తండ్రి అబ్దుల్ రషీద్ తన కొడుకును చూసి గర్విస్తున్నానంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఐపీఎల్-15వ సీజన్లో తన సంచలన ప్రదర్శనతో దేశమంతా తనవైపు చూసేలా అద్భుతమైన బౌలింగ్తో ఆకట్టుకున్న జమ్మూ కుర్రాడు ఉమ్రాన్ మాలిక్కు టీమిండియా నుంచి పిలుపొచ్చింది.
ఆదివారం జాతీయ సెలెక్టర్లు దక్షిణాఫ్రికా సిరీస్ కోసం ప్రకటించిన 18 మంది సభ్యుల జాబితాలో ఉమ్రాన్ కూడా ఉన్నాడు. కాగా, తన కొడుకు పేరును జాతీయ జట్టులో చూసేసరికి ఉమ్రాన్ మాలిక్ తండ్రి అబ్దుల్ రషీద్ భావోద్వేగానికి లోనయ్యాడు. తన కొడుకు దేశం తరఫున ఆడుతున్నాడని, ఇంతకుమించిన ఆనందం ఇంకోటి ఏముండదని తెలిపాడు.
ఉమ్రాన్ టీమిండియాలోకి ఎంపికైన సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘నా కొడుకు జాతీయ జట్టుకు ఎంపికైన విషయం నేను ఇంటర్నెట్లో చూశాను. అది తెలియగానే నా దగ్గరికి చాలా మంది వచ్చి అభినందిస్తున్నారు. దేశం తరఫున ఆడటం కంటే పెద్ద విషయమేముంటుంది..? ఉమ్రాన్ మా అందరినీ గర్వపడేలా చేశాడు.. నా కొడుకుకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తుండటం చాలా ఆనందంగా ఉంది. అతడు తన ప్రతిభనే నమ్ముకుని ఇక్కడిదాకా చేరుకున్నాడు. అందుకోసం ఎంత కష్టపడ్డాడో మాకు మాత్రమే తెలుసు. అతడి కష్టమే ఇప్పుడు అతడి విజయాలకు ప్రతిఫలంగా మారింది.
ఉమ్రాన్ భారత జట్టుకు ఎంపికవడం మా అందరికీ గర్వకారణం. నా కొడుకు దేశం తరఫున అరంగేట్రం చేసిన రోజు నేను, అతడి అమ్మ (ఉమ్రాన్ తల్లి) ఉమ్రాన్ను ఉత్సాహపరిచేందుకు స్టాండ్స్లో ఉంటాం. కానీ ఇప్పటికైతే నన్ను దయచేసి విడిచిపెట్టండి.. నా కొడుకు మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వొద్దు అని చెప్పాడు. ఏమనుకోవద్దు..’ అని రషీద్ తెలిపాడు.
జమ్మూలో ఓ పండ్ల దుకాణం నడుపుతున్న రషీద్.. తన కొడుకు కలను కలగా ఉంచకుండా అతడికి మద్దతునిచ్చాడు. క్రికెటర్గా కొడుకు కెరీర్ను తీర్చిదిద్దేందుకు ఎన్నో త్యాగాలకు సిద్ధపడ్డాడు. ఉమ్రాన్ కూడా నేల విడిచి సాము చేయకుండా ఒదిగి ఉండి తన తల్లిదండ్రులకు గర్వకారణమయ్యాడు.