న్యూఢిల్లీ: స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. ఆసియాగేమ్స్ ట్రయల్స్లో పోటీపడేందుకు అనుమతిచ్చిన ఢిల్లీ హైకోర్టును సవాలు చేస్తూ జాతీయ రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) సుప్రీం కోర్టును ఆశ్రయించింది. శుక్రవారం ఈ కేసు విచారణకు రానుంది.
వినేశ్ను ట్రయల్స్కు అనుమతిచ్చే విషయంలో ఈనెల 22న ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై సమగ్ర వివరణ ఇచ్చేందుకు తమకు సరైన అవకాశమివ్వలేదని డబ్ల్యూఎఫ్ఐ పేర్కొంది. విడుదల చేసిన ఎంపిక ప్రక్రియను అనుసరించి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు సరైనవి కావని తెలిపింది. దీనికి తోడు గుర్తింపు పొందిన జాతీయ క్రీడా సమాఖ్యను అనుసరించి ఎంపిక జరుగుతుందని, ఇందులో న్యాయవ్యవస్థ అతిగా కలుగజేసుకోవడం సమంజసం కాదని పేర్కొంది.