WFI: ఏడాదికాలంగా ఆందోళనల బాట పట్టిన కుస్తీ వీరులు మళ్లీ రింగ్లోకి దూకబోతున్నారు. 2024 ఫిబ్రవరి 2 నుంచి 5 వరకూ జైపూర్ (రాజస్తాన్) లో రెజ్లింగ్ సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ నిర్వహించనున్నట్టు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అడ్హక్ కమిటీ ప్రకటించింది. డబ్ల్యూఎఫ్ఐలో ఇటీవలే ఎన్నికైన సంజయ్ సింగ్ ప్యానెల్ను సస్పెండ్ చేసిన అనంతరం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వాటి వ్యవహారాలను చూసుకునేందుకు గాను అడ్హక్ కమిటీని నియమించాలని సూచించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ).. భూపేందర్ సింగ్ బజ్వా నేతృత్వంలో ముగ్గురు వ్యక్తులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయగా తాజాగా ఆ కమిటీ నేషనల్ ఛాంపియన్షిప్ పై ప్రకటన చేసింది.
జైపూర్ వేదికగా జరుగబోయే ఈ పోటీలలో సీనియర్ ఫ్రీ స్టయిల్, గ్రీకో – రోమన్, మహిళల కేటగిరీలలో రెజ్లర్లు పోటీ పడతారని అడ్ హక్ కమిటీ తెలిపిన ప్రకటనలో పేర్కొంది. అంతేగాక ఈ పోటీల నిర్వహణ, ఇతరత్రా అంశాలన్నీ అడ్హక్ ప్యానెల్ ఆధ్వర్యంలోనే జరుగుతాయని స్పష్టం చేయడం గమనార్హం. నిషేధం ఎదుర్కుంటున్న డబ్ల్యూఎఫ్ఐ సభ్యులతో ఈ పోటీలకు ఎటువంటి సంబంధం ఉండదని అడ్హక్ కమిటీ చెప్పకనే చెప్పింది. జైపూర్లోని గణపతి నగర్లో గల రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (ఆర్ఎస్పీబీ)లోని రైల్వే స్టేడియంలో ఈ పోటీలను నిర్వహించనున్నారు.