న్యూఢిల్లీ: ఇండియన్ క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. జీ మీడియా నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో ఆయన షాకింగ్ విషయాలను తెలిపారు. ఆ స్టింగ్ ఆపరేషన్కు చెందిన వీడియో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. భారత జట్టుతో పాటు క్రికెటర్లపై ఆయన పలు కామెంట్లు చేశారు. భారత జట్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తొలగించిన విషయంపై చేతన్ శర్మ ఆసక్తికర విషయాలు చెప్పారు. డిసెంబర్ 2021లో విరాట్ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన విషయం తెలిసిందే.
నిజానికి ఆ సమయంలో రోహిత్ను కెప్టెన్గా చేయాలని బీసీసీఐకి ఆలోచన లేదని, కానీ విరాట్ను ఆ పగ్గాల నుంచి తప్పించాలన్న ఆలోచన ఉందని, దానిలో భాగంగానే రోహిత్ను ప్రమోట్ చేసినట్లు చేతన్ శర్మ తెలిపారు. విరాట్ పర్ఫార్మెన్స్ సరిగా లేకపోవడంతో.. ఆ కారణంతోనే అతన్ని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించామన్నారు. రోహిత్కు బీసీసీఐ ఫేవర్గా లేకున్నా.. ఆ సమయంలో విరాట్ను పక్కనపెట్టాల్సి వచ్చిందన్నారు.
విరాట్ తనకు తాను గొప్పగా భావించేవాడని, ఆట కన్నా తానే ఎక్కువ అన్న ఫీలింగ్లో ఉండేవాడని, ఆ సమయంలో విరాట్ ప్రవర్తన పట్ల బోర్డులో సరైన అభిప్రాయం లేదని చేతన్ శర్మ తెలిపారు. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ను తన నిర్ణయాన్ని పునరాలోచించాలని కోరామని, కానీ సౌతాఫ్రికా టూర్కు ముందు అతను మీడియాతో మాట్లాడాడని, సెలక్షన్ కమిటీలో జరిగిన చర్చను విరాట్ మీడియా ముందు బయటపెట్టాడని, అప్పటి బీసీసీఐ అధ్యక్షుడికి వ్యతిరేకంగా విరాట్ వ్యవహరించినట్లు చేతన్ శర్మ ఆరోపించారు.