ముంబై : దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి నేపథ్యంలో వాయిదా వేసిన రంజీ ట్రోఫీని రెండు దశల్లో నిర్వహించాలని బోర్డు భావిస్తుందని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ గురువారం తెలిపారు. వాస్తవానికి రంజీ ట్రోఫీ జనవరి 13న ప్రారంభం కావాల్సి ఉండగా.. దేశంలో కరోనా థర్డ్ వేవ్ కారణంగా నిరవధికంగా వాయిదాపడింది. అయితే, మార్చి 27 నుంచి ఐపీఎల్ను ప్రారంభించాలని బీసీసీఐ యోచిస్తున్నందున టోర్నమెంట్ను ఒకేసారి నిర్వహించడం ఆచరణాత్మకంగా అసాధ్యమని, అయితే అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ముందుకు వెళ్లే మార్గాలను అన్వేషించేందుకు బీసీసీ సమావేశం నిర్వహించింది.
‘రంజీ ట్రోఫీని నిర్వహించేందుకు ఉన్న అవకాశాలను అన్వేషిస్తున్నాం. వాయిదా వేసినప్పుడు కేసులు పెరిగాయి. ఇప్పుడు తగ్గుతున్నట్లు కనిపిస్తున్నది. వచ్చే నెలలో లీగల్ దశను నిర్వహించి, మిగతా టోర్నమెంట్ను (ఐపీఎల్ తర్వాత) పూర్తి చేయగలమా? అనే దానిపై కార్యాచరణ బృందం కసరత్తు చేస్తోంది’ అని ధుమాల్ పేర్కొన్నారు. సమావేశానికి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా సైతం హాజరయ్యారు. ప్రస్తుతానికి లీగ్ దశను ఫిబ్రవరిలో ప్రారంభించి.. మార్చి వరకు నెల పాటు నిర్వహించాలని ప్రణాళిక రూపొందించారు. ఆ తర్వాత జూన్ లేదంటే జూలైలో మిగతా దశలను పూర్తి చేయాలని భావిస్తున్నారు.
ఆ సమయానికి భారత్లోని చాలా ప్రాంతాల్లో రుతుపవనాలు ప్రారంభం కానుండగా.. పలు ప్రాంతాల్లో ఎండలు ఉండనున్నాయి. ఈ క్రమంలో ఆపరేషన్ బృందం వాతావరణం, వేదికల లభ్యత, ఆటగాళ్ల తరలింపు తదితర అంశాలను పరిశీలిస్తుందని పేర్కొన్నారు. టోర్నమెంట్ను నిర్వహించేందుకు తాము ఆసక్తిగానే ఉన్నామని, ఆటగాళ్ల భద్రతపై రాజీ పడకుండా.. టోర్నీ ముందుకు సాగేందుకు ఉన్న అవకాశాలను అన్వేషిస్తున్నట్లు వివరించారు. గత ఏడాది సైతం విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ గతేడాది కరోనా మహమ్మారి కారణంగా నిర్వహణకు నోచుకోలేదు. ఆర్థికంగా ఇబ్బందులుపడ్డ ఫస్ట్క్లాస్ క్రికెట్లరందరికీ బీసీసీఐ గత మ్యాచ్ ఫీజులో 50శాతం పరిహారంగా చెల్లించింది.