Sukhjeet Singh : కొత్త ఏడాదిలో భారత హాకీ జట్టుకు పెద్ద సవాల్ ఎదురుకానుంది. ఆస్ట్రేలియా సిరీస్లో పరాజయం తర్వాత స్వదేశంలో హాకీ వరల్డ్ కప్ ఆడనుంది. దాంతో, ఈ మెగా టోర్నీ కోసం జట్టంతా ఉత్సాహంగా ఎదురు చూస్తోందని భారత హాకీ ఫార్వర్డ్ ప్లేయర్ సుఖ్జీత్ సింగ్ అన్నాడు. ‘మా అందరిలో టీమ్ స్పిరిట్ ఉంది. వరల్డ్కప్లో స్పెయిన్తో జరిగే తొలి మ్యాచ్ కోసం మేమంతా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం. జట్టులో ప్రతి ఒక్కరూ పాజిటివ్గా ఉన్నారు. అంతేకాదు ఒకరికొకరు మద్దతుగా నిలుస్తున్నారు’ అంటూ సుఖ్జీత్ వెల్లడించాడు.
హాకీ వరల్డ్ కప్కు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. జనవరి 13 నుంచి 29 వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది. కప్పు కోసం మొత్తం 16 జట్లు పోటీపడనున్నాయి. టీమిండియా గ్రూప్ బిలో ఉంది. అందులో భారత్, స్పెయిన్, ఇంగ్లండ్, వేల్స్ జట్లు ఉన్నాయి. జనవరి 13న రూర్కెలాలో జరిగే మ్యాచ్లో టీమిండియా, స్పెయిన్తో తలపడనుంది. పోయిన ఏడాది ఆస్ట్రేలియా పర్యనకు వెళ్లిన భారత హాకీ జట్టు ఘోరంగా ఓడిపోయింది. ఐదు టెస్టుల హాకీ సిరీస్ను కోల్పోయింది. దాంతో, భారత హాకీ జట్టు స్వదేశంలో జరిగే వరల్డ్ కప్లో టైటిల్ సాధించాలనే కసితో ఉంది. కొత్త ఏడాదిని విజయంతో ఆరంభించాలని హాకీ ఆటగాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు.