Wasim Jaffer : ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లో టీమిండియా టాప్ గన్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఒత్తిడి లేకుండా ఆడడానికి మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఒక సలహా చెప్పాడు.బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీకి సన్నద్ధం కావడానికి వీళ్లు రంజీ క్రికెట్ ఆడాలని సూచించాడు. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘ఈమధ్య కోహ్లీ టెస్టు మ్యాచ్ ఆడక చాలా రోజులవుతుంది. రోహిత్, మిగతావాళ్లు కూడా గత కొంత కాలంగా టెస్టు క్రికెట్ ఆడలేదు. అందుకని రంజీ మ్యాచ్లు ఆడితే బెటర్. దాంతో మొదటి టెస్టులో ఒత్తిడికి లోనవకుండా ఆడతారు. రంజీల్లో ఒక మ్యాచ్ లేదా రెండు ఇన్నింగ్స్లు ఆడితే వాళ్లకు ఎంతో ఉపయోగపడుతుంది. ఎంత అనుభవం ఉన్నా కూడా మ్యాచ్ ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో మొదటి మ్యాచ్లో ఒత్తిడికి లోనవ్వకూడదు’ అని జాఫర్ అభిప్రాయపడ్డాడు. ఫిబ్రవరి 9న నాగ్పూర్లో భారత్, ఆసీస్ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది.
డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడాలంటే..
‘ఈ ఏడాదిలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ (డబ్ల్యూటీసీ) ఉంది. అందుకని ఇరుజట్లకు బోర్డర్ – గవాస్కర్ సిరీస్ ఎంతో కీలకం. ఈ సిరీస్లో గెలిస్తే భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే అవకాశం ఉంది. అంతేకాదు నంబర్ 1 స్థానానికి ఎగబాకుతుంది’ అని జాఫర్ వెల్లడించాడు. ఇప్పటికే ఆసీస్ జట్టు డబ్య్లూటీసీ ఫైనల్ బెర్తు ఖరారు చేసింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా 136 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. భారత్ (99 పాయింట్లు) రెండు, శ్రీలంక (64 పాయింట్లు) మూడు స్థానాల్లో ఉన్నాయి.