Wasim Jaffer : భారత జట్టు త్వరలోనే అన్ని ఫార్మాట్లలో నంబర్ 1 అవుతుందని మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అన్నాడు. టీమిండియా ఇదే ఆటతీరు కొనసాగిస్తే మరికొద్ది రోజుల్లోనే వన్డే, టీ20, టెస్టుల్లో నంబర్ వన్ ర్యాంకు సొంతం చేసుకుంటుందని జాఫర్ అభిప్రాయపడ్డాడు. వన్డేల్లో భారత్ కచ్చితంగా నంబర్ 1 ర్యాంక్కు ఎగబాకుతుంది అని అతను తెలిపాడు. ప్రస్తుతం భారత్ వన్డే ర్యాంకింగ్స్లో మూడో స్థానంలో ఉంది. న్యూజిలాండ్పై మూడో వన్డేలో గెలిస్తే నంబర్ వన్ ర్యాంక్కు చేరుకుంటుంది. టాప్లో ఉన్న న్యూజిలాండ్ రెండు వన్డేల్లో ఓటములతో రెండో ర్యాంకుకు పడిపోయింది. ప్రస్తుతం టీ20 పురుషుల జట్టు ర్యాకింగ్స్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. టెస్టుల్లో రెండో ప్లేస్లో నిలిచింది.
టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్, పాండ్యా బ్యాటింగ్లో అదరగొడుతున్నారు. సిరాజ్, షమీ, అక్షర్పటేల్ బంతితో చెలరేగుతున్నారు. దాంతో స్వదేశంలో శ్రీలంకపై టీ20, వన్డే సిరీస్లు గెలిచింది. అంతేకాదు న్యూజిలాండ్ను రెండు వన్డేల్లో ఓడించి సిరీస్ కైవసం చేసుకుంది. దాంతో సొంత గడ్డపై 25 వన్డే సిరీస్లు సొంతం చేసుకుంది. ఫిబ్రవరిలో స్వదేశంలో బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ జరగనుంది. ఈ సిరీస్లో అదరగొడితే వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడే అవకాశం ఉంటుంది.