IND vs ENG | వన్డే ప్రపంచకప్ను వర్షం నీడలా వెంటాడుతున్నది. అక్టోబర్ 5 నుంచి మెగాటోర్నీ ప్రారంభం కానుండగా.. అంతకుముందు జరుగుతున్న వార్మప్ మ్యాచ్లకు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. శుక్రవారం అఫ్గానిస్థాన్, దక్షిణాఫ్రికా మధ్య తిరువనంతపురంలో జరుగాల్సిన మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు కాగా.. తాజాగా భారత్ ఇంగ్లండ్ మ్యాచ్ కూడా రద్దయ్యింది. గువాహటిలో జరగాల్సిన ఈ మ్యాచ్కు భారీ వర్షం అడ్డుపడింది. వర్షం కారణంగా టాస్ కాస్త ఆలస్యం కాగా.. ఆ తర్వాతైనా పరిస్థితిలో మార్పు వస్తుందేమో అనుకుంటే అదీ సాధ్య పడలేదు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత నిర్వాహకులు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
పుష్కర కాలం తర్వాత భారత్లో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ తొలి పోరులో (అక్టోబర్ 8న; చెన్నై వేదికగా) ఆస్ట్రేలియాతో టీమ్ఇండియా అమీతుమీ తేల్చుకోనుండగా.. అంతకుముందు రెండు వార్మప్ మ్యాచ్లు ఆడనుంది. అందులో భాగంగా గువాహటిలో ఇంగ్లండ్తో ప్రాక్టీస్ పోరులో అస్త్రశస్త్రాలను సరిచూసుకుందాం అనుకుంటే.. వరుణుడు ఆ అవకాశమే ఇవ్వలేదు. టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఆ తర్వాత చినుకులతో ప్రారంభమైన వాన.. కాసేపట్లోనే మైదానాన్ని ముంచెత్తింది. దీంతో కీలక పోరును రద్దు చేయక తప్పలేదు. ఇక ఇదే మైదానంలో శుక్రవారం బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య జరిగిన పోరుకు ఎలాంటి అంతరాయం వాటిల్లలేదు. మరోవైపు తిరువనంతపురం వేదికగా ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్కు కూడా వర్షం అంతరాయం కలిగించింది. దీంతో ఆట ఆలస్యంగా ప్రారంభం కాగా.. మ్యాచ్ను 23 ఓవర్లకు కుదించారు.
మెగాటోర్నీ ప్రారంభానికి ముందే వర్షాలు ముంచెత్తుతుండటంతో.. వర్షకాలంలో అసలు ఇంత పెద్ద టోర్నీ ఎందుకు నిర్వహిస్తున్నారో అని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా మన దేశంలో అక్టోబర్-నవంబర్లో వాతావరణం చల్లబడి ఉండాల్సింది పోయి.. రుతుపవనాలు ఆలస్యం కావడంతో వర్షాలు కురుస్తున్నాయి. వార్మప్ మ్యాచ్లు పోయినా.. వరల్డ్ కప్ ప్రధాన పోటీలైనా సజావుగా సాగితే అదే పదివేలు అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సాధారణంగా వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ వేసవిలో ఉంటుంది.. కానీ ఈ సారి మాత్రం నిర్వాహకులు ఇలాంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నారు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.