‘విఠలేశ్వరుడు’ అంటే తెలియని ఆ పల్లెలో, కాకతీయుల కాలంలోనే విఠలుడి ఆలయం నిర్మితమైంది. పశుసంపదను కాపాడే దేవుడిగా ఆ స్వామి పూజలందుకొన్నాడు. ఆ ఆలయం పేరు మాత్రం ‘బర్రె గుడి’గా స్థిరపడిపోయింది. సరైన పరిరక్షణ చర్యలు లేక శిథి లావస్థకు చేరింది. గుప్తనిధుల తవ్వకాల్లోనూ కొంత ధ్వంసమైంది. ఆలయ విశిష్టతను తెలుసుకున్న స్థానిక పాలకవర్గం, ‘బర్రె గుడి’ని సంరక్షించేందుకు చర్యలు చేపడుతున్నది.
వరంగల్ అర్బన్ జిల్లా కొత్తకొండ గ్రామంలో పురాతన విఠలేశ్వరాలయం ఉన్నది. 13వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని కాకతీయులు నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. నాటికాలంలో విఠలేశ్వరస్వామిని గోవులను సంరక్షించే దేవుడిగా ప్రజలు ఆరాధించేవారు. చుట్టూ అడవి, గుట్టల నడుమ ఉన్న ఈ పురాతన ఆలయ సమీపంలోనే స్థానికులు తమ పశు సంపదను(ఆవులు, బర్రెలు, గొర్రెలు..) మేపుకునేవారు. అందుకోసమే కాలక్రమంలో ఈ ఆలయానికి ‘బర్రె గుడి’ అని పేరువచ్చినట్లు చెబుతున్నారు.
ఆరో శతాబ్దం నాటికే..
విఠోబా సాంప్రదాయం ఆరంభానికి ముందే విఠలేశ్వరుడు గ్రామ దేవుడిగా పూజలందుకున్నాడని చరిత్రకారులు భావిస్తున్నారు. విఠోభా సంప్రదాయం, ప్రధాన ఆలయ పుట్టుపూర్వోత్తరాల గురించి అనేక వాదనలు ఉన్నా.. 13వ శతాబ్దానికి ముందే వాటి ఉనికి నిర్ధారించేందుకు తగిన ఆధారాలున్నాయని చెబుతున్నారు. ‘ఎ సోషల్ హిస్టరీ ఆఫ్ దక్కన్’ అనే పుస్తకం రాసిన రిచర్డ్ మాక్స్వెల్ ఈటన్ ప్రకారం, ఆరవ శతాబ్దానికే విఠోబాను గ్రామదైవంగా ఆరాధించారని తెలుస్తున్నది.
ఎన్నో విశేషాలు..
ఆలయంలోని మూల విరాట్టు శివుడి పానపట్టంపై కొలువై ఉండటం ఇక్కడి విశేషం. ఈ విగ్రహం బిహార్కు చెందిన పశువుల కాపరుల తెగ ‘అహిర్’ జాతి దైవం ‘బిర్ కువర్’ను పోలి ఉన్నది. స్వామివారి విగ్రహం కింది భాగంలోనే రకుమాయి(రుక్మిణీదేవి) కొలువై ఉన్నది. కొత్తకొండలోని విఠలేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోనే లక్ష్మీదేవి ఆలయం ఉన్నది. అయితే, ఆలయంలో అమ్మవారి విగ్రహం లేదు. ద్వారపాలకులుగా హనుమంతుడు, గరుత్మంతుడి విగ్రహాలు ఉన్నాయి. ప్రధానాలయంలోని విఠలేశ్వరుడి విగ్రహంలోనే నడుముకు కట్టిన గుడ్డ, సన్నని పట్టీ కనిపిస్తున్నది. స్వామివారి నడుము చుట్టూ మేఖల ఉన్నది. కాళ్ల మధ్యలో భూమికి ఆనించి ఉన్న ఒక పొడవాటి కర్రతోపాటు మోచేతుల వద్ద ముత్యాల సరాలు ఉన్నట్లు తెలుస్తున్నది. విగ్రహానికి నాలుగు చేతులుండగా, రెండు ధ్వంసమయ్యాయి. ఆలయ ప్రధాన ద్వారానికి ఇరువైపులా హనుమంతుడు, గరుత్మంతుడు నమస్కరిస్తూ కనిపిస్తున్నారు.
ముత్తారంలోనూ..
కొత్తకొండకు కూతవేటు దూరంలోనే ముత్తారం గ్రామమున్నది. ఇక్కడ అతిపురాతనమైన త్రికూటాలయాన్ని కాకతీయులు నిర్మించారు. ఈ ఆలయం వరంగల్లోని వేయిస్తంభాల గుడిని పోలి ఉంటుంది. ఈ ఆలయ సముదాయంలోని ఒక ఉపాలయంలో విఠలేశ్వరస్వామి విగ్రహం కనిపిస్తుంది.
ఆలయ పరిరక్షణ..
ఆలనాపాలనా లేక కొత్తకొండ విఠలేశ్వర ఆలయం శిథిలావస్థకు చేరింది. ధూపదీప నైవేద్యాలు లేకపోవడంతో భక్తులు రావడమూ ఆగిపోయింది. గుప్త నిధుల తవ్వకాలతో ఆలయంలోని కొంతభాగం ధ్వంసమైంది. అయితే, ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని పరిరక్షించాలని గ్రామపంచాయతీ పాలకవర్గం నిర్ణయించింది. ఆలయ సంరక్షణ కోసం సర్పంచ్తోపాటు పాలకవర్గ సభ్యులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. చెత్తాచెదారంతో నిండిన ఆలయాన్ని అందంగా తీర్చిదిద్ది, చుట్టూ కంచెను నిర్మించారు. ఆలయ పరిసరాల్లో అందమైన పూల మొక్కలతో పల్లెప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. విఠలేశ్వరస్వామి ఆలయ పైకప్పుకూ మరమ్మతులు చేపడుతున్నారు. దాతల సహాయంతో ఆలయానికి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు.
మరమ్మతులు చేస్తున్నాం
ఈ ఆలయాన్ని ఎప్పటి నుంచో ‘బర్రె గుడి’ అనే పిలుస్తున్నరు. ఇక్కడికి వచ్చిన స్తపతి, గుడిలోని విగ్రహాన్ని చూసి విఠలేశ్వర స్వామి విగ్రహమని చెప్పిండు. గుడి విశిష్ఠతను వివరించిండు. మా ఊరిలో ఇంతటి చరిత్ర కలిగిన ఆలయమున్నదని మాక్కూడా తెల్వది. వాన పడ్డప్పుడు ఆలయం పైకప్పు ఉరుస్తంది. అందుకే, మరమ్మతులు చేయిస్తున్నాం.
-దూడల ప్రమీల, సర్పంచ్
ఆలయానికే అందం..
సరైన పరిరక్షణ లేక ఆలయం ధ్వంసమైంది. ఇక్కడి పరిసరాలన్నీ దుర్వాసనతో నిండి ఉండేవి. నిరాదరణకు గురైన ఆలయాన్ని సంరక్షించేందుకు చర్యలు చేపట్టినం. గుడి చుట్టూ కంచె వేసినం. ఆలయ ప్రాంగణంలోనే పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసినం. దీంతో ఇప్పుడు ఆలయానికే వన్నె వచ్చింది. పచ్చటి చెట్లతో కళకళలాడుతున్న ఆలయాన్ని చూసేందుకు ఎంతోమంది వస్తున్నరు.
-సిద్దమల్ల కృష్ణ, ఉపసర్పంచ్
-కిశోర్ గుడికందుల
ఇవీ కూడా చదవండి…
ఓపెన్ మార్కెట్లో కోవిడ్ టీకాలు అమ్మాలి..
ముగిసిన తిరుపతి ఉప ఎన్నిక.. 64.29 శాతం పోలింగ్
రైల్వే పరిసరాల్లో మాస్క్ ధరించకుంటే జరిమానా.. ఎంతంటే?