న్యూఢిల్లీ: కరోనా నియంత్రణ కోసం భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. రైల్వే పరిసర ప్రాంతాల్లో మాస్క్ లేకుండా తిరిగేవారిపై రూ.500 జరిమానా విధించనున్నది. రైల్వే చట్టం ప్రకారం ఈ శిక్ష ఉంటుందని ఇవాళ రైల్వే శాఖ పేర్కొన్నది. రైల్వే స్టేషన్లోకి ఎంట్రీ అయ్యే సమయంలో కానీ, రైలులో ప్రయాణం చేసే సమయంలో కానీ.. ప్రతి ఒక్కరు మాస్క్ను ధరించాల్సి ఉంటుంది. ఇప్పటికే కరోనా నియంత్రణ కోసం అనేక చర్యలు చేపట్టామని, ఇప్పుడు తాజాగా మాస్క్ ధరించిన వారిపై జరిమానా విధించనున్నట్లు రైల్వేశాఖ తన ఆదేశాల్లో పేర్కొన్నది. కేంద్ర ఆరోగ్యశాఖ ఇచ్చిన సూచనల మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. రానున్న ఆరు నెలల పాటు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని రైల్వేశాఖ ఇవాళ తన ప్రకటనలో స్పష్టం చేసింది. రైల్వే అధికారులు ఈ ఫైన్ వసూల్ చేయనున్నట్లు తెలుస్తోంది.