అమరావతి : తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక తీవ్ర ఉత్కంఠ పరిస్థితుల నడుమ ముగిసింది. సాయంత్రం 7 గంటల్లోపు క్యూలైన్లలో ఉన్నవారిని ఓటేసేందుకు అధికారులు అనుమతించారు. సాయంత్రం 7 గంటల వరకు 64.29 శాతం పోలింగ్ నమోదైంది.
గత ఎన్నికల్లో ఇక్కడ 79 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ ప్రారంభం నుంచి తిరుపతి నియోజకవర్గంలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. అధికార వైసీపీ భారీగా దొంగ ఓటర్లను రంగాలోకి దించిందని టీడీపీ, బీజేపీ, జనసేన ఆరోపించాయి. పలువురిని అడ్డుకోవడంతో పరిస్థితి గందరగోళంగా మారింది.
దొంగ ఓట్లరతోపాటు నకిలీ ఓటర్ కార్డుల్ని పట్టుకున్న బీజేపీ, టీడీపీ నేతలు అక్రమాలపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఏకంగా పోలింగ్ను రద్దు చేసి కేంద్ర బలగాలు, సిబ్బంది ఆధ్వర్యంలో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
అధికార పార్టీ అక్రమాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు వ్యాఖ్యలను వైసీపీ నేతలు ఖండించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి