ICC Hall of Fame: టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ క్రికెట్కు చేసిన సేవలకు గాను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అత్యంత ప్రతిష్టాత్మక ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు కల్పించింది. వీరూతో పాటు భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ డయానా ఎడుజీ, లంక దిగ్గజం అరవింద డిసిల్వలకూ ఈ ఘనత దక్కింది. అయితే ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ ఘనత పొందిన నజఫ్గఢ్ నవాబ్ కంటే ముందే పలువురు భారత దిగ్గజ క్రికెటర్లు ఈ గౌరవాన్ని అందుకున్నారు. వీరూ కంటే ముందు ఏకంగా ఏడుగురు క్రికెటర్లు హాల్ ఆఫ్ ఫేమ్ పొందడం గమనార్హం.
ఈ జాబితాలో లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్, బిషన్ సింగ్ బేడి, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, వినూ మన్కడ్లు వీరూ కంటే ముందున్నారు. తాజాగా డయానా ఎడూజీతో పాటు వీరూ కూడా చేరడంతో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ పొందిన ఆటగాళ్ల జాబితాలో భారత క్రికెటర్ల సంఖ్య 9కి చేరింది.
Well deserved!
Many congratulations to the Nawab of Najafgarh for being inducted into the ICC Hall of Fame 👏👏@virendersehwag https://t.co/Unt3fSIZhv
— BCCI (@BCCI) November 13, 2023
1999లో భారత క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన వీరూ.. 2013 వరకూ ఆడాడు. తన సుదీర్ఘ కెరీర్లో వీరూ.. 104 టెస్టులు, 251 వన్డేలు, 19 టీ20లు ఆడాడు. టెస్టులలో 8,586 పరుగులు చేసిన సెహ్వాగ్.. వన్డేలలో 8,273 రన్స్ చేయగా టీ20లలో 394 రన్స్ చేశాడు. టెస్టులలో 23 సెంచరీలు చేసిన వీరూ.. వన్డేలలో 15 శతకాలు బాదాడు.