ప్రస్తుతం క్రికెట్ అభిమానులందరి మనసుల్లో మెదులుతున్న ఏకైక ప్రశ్న కోహ్లీ తిరిగి ఫామ్లోకి వచ్చినట్లేనా? అని. ఇంగ్లండ్ పర్యటనలో విఫలమైన కోహ్లీ.. ఆ తర్వాత విండీస్, జింబాబ్వే పర్యటనల్లో ఆడలేదు. ఈ సమయంలో మూడు వారాలపాటు పూర్తిగా రెస్ట్ తీసుకున్నాడు. దీంతో అతను ఆసియా కప్లో ఫ్రెష్గా కనిపిస్తాడని టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హెడ్ కోచ్ సంజయ్ బంగర్ చెప్పాడు.
ఈ 33 ఏళ్ల స్టార్ క్రికెటర్.. విశ్రాంతి సమయంలో అస్సలు క్రికెట్ గురించి మాట్లాడలేదని సంజయ్ వెల్లడించాడు. ఇంతకు ముందు కూడా విశ్రాంతి తీసుకున్నప్పటికీ.. వాటిని పూర్తి బ్రేక్ అని చెప్పలేమన్నాడు. కానీ ఈ మూడు వారాల్లో మాత్రం కోహ్లీ.. క్రికెట్కు దూరంగా వెళ్లాడని, ఆసియా కప్ను చాలా ఫ్రెష్గా మొదలు పెడతాడని వివరించాడు. క్రికెట్ గురించి మాట్లాడలేదంటే.. కోహ్లీకి తను ఎలా ఆడాలో చాలా స్పష్టంగా తెలిసినట్లేనని, అతను తనలా ఉన్నప్పుడే అద్భుతంగా ఆడాడని గుర్తుచేశాడు.
ఆదివారం నాడు పాకిస్తాన్తో జరిగే టీ20 మ్యాచ్ కోహ్లీకి 100వది కావడం గమనార్హం. భారత్ తరఫున ఇన్ని టీ20లు ఆడిన రెండో ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించనున్నాడు. అతని కన్నా ముందు ఈ జాబితాలో రోహిత్ శర్మ (132) ఉన్నాడు. రోహిత్ ఆడినన్ని అంతర్జాతీయ టీ20 మ్యాచులు ప్రపంచంలో మరే క్రికెటర్ ఆడలేదు.