టీమిండియా తరఫున 100 టెస్టులు ఆడిన క్రికెటర్గా చరిత్ర సృష్టించేందుకు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రెడీ అవుతున్నాడు. మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగే తొలి టెస్టు కోహ్లీకి 100వది. ఈ మ్యాచ్లో 50 శాతం మంది ప్రేక్షకులను అనుమతించాలని బీసీసీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఈ మ్యాచ్ గురించి మాట్లాడాడు.
కోహ్లీకి ఇది చాలా ప్రత్యేకమైన టెస్టు అని, ఇది చూడటం కోసం స్వయంగా మొహాలీ వెళ్తానని గంగూలీ చెప్పాడు. కొన్ని రోజుల క్రితం కోహ్లీ కెప్టెన్సీ వివాదంలో గంగూలీ, కోహ్లీ చేసిన వ్యాఖ్యలు భిన్నంగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో గంగూలీపై కోహ్లీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. పలువురు మాజీలు కూడా గంగూలీ ముందుకొచ్చి వాస్తవం చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం లండన్లో కుటుంబంతో కలిసి హాలీడే ఎంజాయ్ చేస్తున్న గంగూలీ.. ఈ విషయంపై స్పందించడానికి నిరాకరించాడు. అదే సమయంలో కోహ్లీ అద్భుతమైన ఆటగాడని మెచ్చుకున్నాడు. టెస్టుల్లో నాలుగో స్థానంలో ఆడినా, పరిమిత ఓవర్ల క్రికెట్లో మూడో స్థానంలో ఆడినా కోహ్లీ అత్యుత్తమంగా ఆడాడని చెప్పాడు. రెండేళ్లుగా కోహ్లీ సెంచరీ చేయకపోవడం గురించి ప్రస్తావిస్తూ.. అది పెద్ద విషయం కాదన్నాడు.
కోహ్లీకి సెంచరీలు ఎలా చేయాలో బాగా తెలుసని, అందుకే ఇప్పటి వరకు 70 సెంచరీలు చేశాడని చెప్పాడు. త్వరలోనే కోహ్లీ మళ్లీ సెంచరీలు చేయడం ప్రారంభిస్తాడని అభిప్రాయపడ్డాడు. 2014లో ఫామ్ కోల్పోయిన సందర్భంలో కోహ్లీ పోరాడిన తీరు అద్భుతమని, ఇంగ్లండ్లో అతని సిరీస్ చూసి ఆశ్చర్యపోయానని తెలిపాడు. ఆ తర్వాత అతను ఐదేళ్ల పాటు సూపర్ ఫామ్తో క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన సంగతి తెలిసిందే.