న్యూఢిల్లీ: ఐపీఎల్ 15వ సీజన్లో తన కెరీర్లోనే అత్యంత పేలవ ప్రదర్శనతో తీవ్రంగా నిరుత్సాహపరుస్తున్న భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి కొన్ని రోజులు విశ్రాంతి దక్కనుంది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగనున్న టీ20 సిరీస్కు రెస్ట్ తీసుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే కోహ్లీ ఫామ్పై భారత మాజీ కోచ్ రవిశాస్త్రితోపాటు ఇతర ఆటగాళ్లు ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని నెలలపాటు అతడికి విశ్రాంతినివ్వాలని చాలా మంది సూచనలు చేస్తున్నారు. కోహ్లీ ప్రదర్శనపై ఇటీవల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన రవిశాస్త్రి.. ‘ఐపీఎల్ తర్వాత కాదు.. ఇప్పటికిప్పుడు లీగ్ నుంచి వైదొలుగాలి’ అని తెలిపాడు. ఈ నేపథ్యంలో జూన్ 9 నుంచి 19 మధ్య జరిగే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు కోహ్లీకి బోర్డు విరామం ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది. విరామం అనంతరం ఇంగ్లండ్తో సిరీస్కు ఈ ‘రన్ మెషిన్’ రెట్టింపు ఉత్సాహంతో తిరిగి వస్తాడని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నాయి. ‘దక్షిణాఫ్రికా సిరీస్కు విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది. అతడు చాలా కాలం నుంచి బయోబబుల్లో ఉంటూ క్రికెట్ ఆడుతున్నాడు. సీనియర్ ఆటగాళ్లకు సమయానుకూలంగా విశ్రాంతినివ్వాలని మా విధాన నిర్ణయంలో ఉంది’ అని బోర్డు ప్రతినిధి ఒకరు తెలిపారు.
జూన్ 9 నుంచి 19 వరకు ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఢిల్లీ, కటక్, విశాఖపట్నం, రాజ్కోట్, బెంగళూరు వేదికల్లో జరుగనుంది. అనంతరం జూన్, జూలైలో టీమ్ఇండియా యూకేలో ఐర్లాండ్తో టీ20 సిరీస్, ఇంగ్లండ్తో మిగిలిన ఏకైక టెస్టుతోపాటు టీ20, వన్డే సిరీస్ ఆడనుంది.