ఇంగ్లండ్ పర్యటన ముందు టీమిండియా టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో అతను జట్టుతో కలిసి ఇంగ్లండ్ వెళ్లలేదు. క్వారంటైన్ తర్వాతనే జట్టుతో కలవనున్నాడు. అంతేకాదు. ఈ పర్యటన ముందు మాజీ సారధి విరాట్ కోహ్లీకి కూడా కరోనా సోకినట్లు సమాచారం.
ఐపీఎల్ ముగిసిన తర్వాత సౌతాఫ్రికా సిరీస్లో సీనియర్లకు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో కుటుంబంతో కలిసి మాల్దీవ్స్ వెళ్లిన కోహ్లీ.. అక్కడి బీచ్లలో ఎంజాయ్ చేశాడు. అనంతరం స్వదేశానికి తిరిగి వచ్చినప్పుడు అతనికి కరోనా పాజిటివ్ వచ్చిందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
అయితే ఆ తర్వాత అతను కోలుకున్నాడని, అందుకే జట్టుతో కలిసి ఇంగ్లండ్ చేరుకున్నాడని తెలుస్తోంది. ఈ క్రమంలో కౌంటీ జట్లతో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్లలో వీళ్లపై ఒత్తిడి లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కరోనా నుంచి కోలుకున్న ఆటగాళ్లపై తీవ్రమైన ఒత్తిడి మంచిది కాదనేది వైద్యుల సలహా.
అంతేకాదు, ఇంగ్లండ్ చేరుకున్న తర్వాత టీమిండియా సారధి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ షాపింగ్కు వెళ్లినప్పుడు అభిమానులను కలిశారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ ధుమాల్..
జట్టు ఆటగాళ్లంతా మరింత అప్రమత్తంగా ఉండాలని, కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించాలని సూచనలు పంపినట్లు తెలిపారు. గతేడాది కరోనా కారణంగా ఐదో టెస్టు రద్దయినట్లు మరోసారి జరగడం తమకు ఏమాత్రం ఇష్టం లేదని ఆటగాళ్లకు స్పష్టం చేసినట్లు ఆయన వెల్లడించారు.