కోహ్లీ టీ20 కెప్టెన్సీపై సాగుతున్న వివాదం
పరిమిత ఓవర్లకు వేర్వేరు కెప్టెన్లు వద్దనుకున్నాం
సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్శర్మ
భారత కెప్టెన్సీ మార్పుపై వివాదం కొనసాగుతూనే ఉన్నది. రోజుకో మలుపు తిరుగుతూ రక్తి కట్టిస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి బోర్డుకు మధ్య అభిప్రాయభేదాలు పొడచూపుతూనే ఉన్నాయి. కెప్టెన్సీ విషయంలో బీసీసీఐ వైఖరిని కోహ్లీ ఎండగట్టిన నేపథ్యంలో ఇన్ని రోజులు ఓపిక పట్టిన బోర్డు పెద్దలు తమ వైఖరిని తేటతెల్లం చేశారు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కోసం శుక్రవారం జట్టును ఎంపిక చేసిన సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ..కోహ్లీ కెప్టెన్సీ మార్పుపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్కు ఒకరే కెప్టెన్ ఉండాలన్న నిశ్చితాభిప్రాయంతో కోహ్లీని తప్పించామని స్పష్టం చేశాడు. అలాగే కోహ్లీ, రోహిత్శర్మ మధ్య తాను ఎలాంటి విభేదాలు ఇప్పటి వరకు చూడలేదని శర్మ చెప్పుకొచ్చాడు. కెప్టెన్సీ వివాదంలోకి ఓసారి వెళితే… ‘సమావేశం మొదలైన కొద్దిసేపటికే కోహ్లీ తప్పుకుంటానని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. బోర్డు సభ్యులతో పాటు సెలెక్షన్ కమిటీ మెంబర్స్…నిర్ణయంపై పునరాలోచించుకోవాలని కోహ్లీకి సూచించారు. టీ20 ప్రపంచకప్ ముంగిట ఇలాంటి వాటి వల్ల జట్టులోని ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రభావం చూపిస్తుందన్నాం. జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కొనసాగాలని అందరం(గంగూలీ, జైషాతో పాటు బోర్డు సభ్యులు)కోరాం. కానీ అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిన విరాట్ మా మాట వినకుండా వీడ్కోలు పలికేందుకే మొగ్గుచూపాడు. జట్టుకు మూల స్తంభమైన విరాట్ నిర్ణయాన్ని మేము గౌరవించాం’ అని అన్నాడు.
ఒకరే ఉండాలనుకున్నాం
టీ20 కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకోవాలన్న నిర్ణయానికి వచ్చిన తర్వాత సెలెక్షన్ కమిటీ ఒక అభిప్రాయానికి వచ్చిందని శర్మ అన్నాడు. ‘పరిమిత ఓవర్ల ఫార్మాట్కు ఇద్దరు కెప్టెన్లు ఉండవద్దు అనేది నిర్ణయించుకున్నాం. టీ20 నాయకత్వానికి విరాట్ వీడ్కోలు తర్వాత మాకు ఒక క్లారిటీ వచ్చింది. టీ20ల నుంచి వైదొలుగడం విరాట్ నిర్ణయమైతే.. వన్డే కెప్టెన్సీ నుంచి మేము అతన్ని తప్పించాం. వాస్తవానికి ప్రపంచకప్ జరుగుతున్నప్పుడు తొలిగించడానికి సరైన సమయం కాదనుకున్నాం. పరిస్థితులు సద్దుమణిగే వరకు ఓపిక పట్టాం. తప్పిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంటే ప్రపంచకప్పై ప్రభావం చూపిస్తుందనుకున్నాం. అందుకే ఆ విషయం చెప్పేందుకు ఇది సరైన సమయం కాదని భావించాం’ అని అన్నాడు.