సడెన్గా టెస్టు కెప్టెన్సీకి కోహ్లీ గుడ్బై చెప్పడం క్రికెట్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. అయితే మాజీ దిగ్గజ ఆటగాడు, ప్రపంచకప్ గెలుపొందిన జట్టు సారధి కపిల్ దేవ్ మాత్రం కోహ్లీ నిర్ణయాన్ని స్వాగతించాడు. టీ20 కెప్టెన్సీ వదులుకున్నప్పటి నుంచి కోహ్లీ చాలా ఒత్తిడిలో ఉన్నట్లు కనిపిస్తున్నాడని కపిల్ దేవ్ అన్నాడు.
గతేడాది కోహ్లీ అంత గొప్ప క్రికెట్ ఆడలేదు. మొత్తం 11 టెస్టు మ్యాచుల్లో 28.21 సగటుతో 536 పరుగులు మాత్రమే చేశాడు. ఇదే విషయాన్ని ఎత్తిచూపిన కపిల్ దేవ్.. ఈ గణాంకాలు కోహ్లీ సత్తాయి ఏమాత్రం సరిపోవన్నాడు. అందుకే తాను కోహ్లీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని చెప్పాడు.
కెప్టెన్సీ వదులుకోవడం వల్ల స్వేచ్ఛగా ఆడే అవకాశం దొరుకుతుందన్నాడు. ‘‘ఈ ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి ముందు అతను చాలా ఆలోచించి ఉంటాడని, అతను కెప్టెన్సీని ఎంజాయ్ చేయడం లేదేమో? మనమంతా అతనికి మద్దతుగా నిలబడాలి’’ అని పిలుపునిచ్చాడు. ప్రపంచకప్ గెలుపొందిన జట్టుకు నాయకత్వం వహించిన కపిల్ దేవ్ కూడా కృష్ణమాచారి శ్రీకాంత్, మహమ్మద్ అజారుద్దీన్ వంటి కెప్టెన్ల కింద ఆడాడు.
ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘సునీల్ గవాస్కర్ నా కెప్టెన్సీలో ఆడాడు. నేను కె. శ్రీకాంత్, అజారుద్దీన్ కింద ఆడాను. నాకేమీ ఈగో లేదు. విరాట్ కూడా తన ఈగో వదిలేసి కుర్ర క్రికెటర్ సారధ్యంలో ఆడాలి. ఇది అతనికి, భారత క్రికెట్కు చాలా మంచిది. కొత్త కెప్టెన్కు విరాట్ మార్గనిర్దేశనం చేయాలి. మనం బ్యాటర్ విరాట్ను పోగొట్టుకోలేం’’ అని కపిల్ స్పష్టంగా చెప్పేశాడు.