వన్డే కెప్టెన్సీ నుంచి వివాదాస్పదంగా తొలగించిన తర్వాత.. సఫారీలతో జరిగిన టెస్టు సిరీస్లో కూడా కోహ్లీ తన జట్టును గెలిపించుకోలేకపోయాడు. రెండో టెస్టులో కేఎల్ రాహుల్ సారధ్యంలో జట్టు ఓటమితో.. మూడో మ్యాచ్లో ఒత్తిడికి గురైన జట్టు ఓటమిపాలైంది. దీంతో ఆ సిరీస్ కూడా చేజారింది. ఆ సమయంలోనే తను టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు కోహ్లీ ప్రకటించాడు.
అప్పటికి ఫామ్ లేక తంటాలు పడుతున్న అతనిపై చాలా మంది మాజీలు పలు రకాల విమర్శలు చేశారు. కొందరు ఉచిత సలహాలు కూడా ఇచ్చారు. అయితే తను అలా టెస్టు కెప్టెన్సీ వదులుకున్నప్పుడు, తనతో ఆడిన ఆటగాళ్లలో కేవలం ఎంఎస్ ధోనీ మాత్రమే తనకు మెసేజ్ చేశాడని కోహ్లీ వెల్లడించాడు. ఆసియా కప్లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాడీ స్టార్ బ్యాటర్.
‘‘నాతో ఆడిన ఆటగాళ్లలో చాలా మంది దగ్గర నా నెంబర్ ఉంది. కానీ టెస్టు కెప్టెన్సీ వదులుకున్నప్పుడు ఎవరూ నన్న సంప్రదించలేదు. ఒక్క ధోనీ మాత్రమే మెసేజ్ చేశాడు. ఇద్దరు ఆటగాళ్ల మధ్య గౌరవం ఉంటే ఒక బంధం ఏర్పడుతుంది. నాకు అవసరం ఉన్న ప్రతిసారీ నేను కూడా అలాగే నేరుగా ధోనీని సంప్రదిస్తా’ అని కోహ్లీ చెప్పాడు. అలాగే తన గురించి రకరకాలుగా మాట్లాడిన ఆటగాళ్లకు కూడా చురకలు వేశాడు.
When I left Test captaincy, only MS Dhoni messaged me: Virat Kohli #AsiaCup2022 #INDvPAK pic.twitter.com/PMxyhXR45h
— Aditya Kukalyekar (@adikukalyekar) September 4, 2022
చాలామంది నిపుణులు, మాజీలు చాలా రోజులుగా ఎన్నో సలహాలు ఇస్తున్నారని, కానీ వారిలో ఒక్కరు కూడా తనను నేరుగా సంప్రదించలేదని చెప్పాడు. తనే ఎవరికైనా సాయం చేయాలనుకుంటే నేరుగా వారిని సంప్రదిస్తానని, అంతేకానీ ఇలా రకరకాల మాధ్యమాల్లో కామెంట్స్ చెయ్యనని తేల్చిచెప్పాడు.
‘‘చాలా మంది చేసినట్లు అలా సలహాలు ఇవ్వడం నాకు ముఖ్యం కాదు. నేను ఎవరికైనా ఏమైనా చెప్పాలంటే నేరుగా వారితో మాట్లాడతా. అంతేకానీ, ప్రపంచం మొత్తం ముందు సలహాలు ఇస్తే నా దృష్టిలో వాటికి అసలు విలువే లేదు’’ అని స్పష్టం చేశాడు. ఆరు వారాల విశ్రాంతి తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడిన కోహ్లీ ఆసియా కప్లో అద్భుతంగా ఆడుతున్నాడు.
వరుసగా రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. పాకిస్తాన్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో అతను ఆడిన 60 పరుగుల ఇన్నింగ్స్ జట్టుకు చాలా కీలకంగా మారింది. అతను అలా ఆడకుంటే కనీసం పోరాడగలిగే స్కోరు కూడా భారత్ చేసుండేది కాదు.